హార్వార్డ్ యూనివర్శిటీ… అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైనది. సదరు వర్శిటీలో చేరే విదేశీ విద్యార్థుల పేర్లను పరిశీలిస్తే, సగం మంది భారతీయులే ఉంటారు. దివంగత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ నుంచి రతన్ టాటా, చిదంబరం దాకా అదే వర్శిటీలో ఒకనాడు విద్యను అభ్యసించిన వారే. ఆ యూనివర్శిటీ మొత్తం ప్రస్తుతం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును జపిస్తోంది.
ఈ రోజు సాయంత్రం గంట సేపు సాగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్’లో పవన్ ఏం మాట్లాడనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత శశిథరూర్, నటుడు మాధవన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్ హోత్రా, ఇండియా టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ రజత్ శర్మ, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, సిప్లా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సామినా వజిరాలీలు సైతం ప్రసంగించనున్నారు.
వీరందరితో పోలిస్తే, పవన్ ప్రసంగం కోసం అత్యధికులు వేచి చూస్తున్నట్టు తాజాగా పవన్ ప్రసంగాలకు వస్తున్న స్పందనే చెప్తోంది. ‘ఇన్ స్పైర్ సిరీస్’ పేరిట జరిగే కార్యక్రమంలో… తనపై చిన్నప్పటి నుంచి ప్రభావం చూపిన అంశాలు, నటుడిగా, రాజకీయ నేతగా ఎదుగుతున్న క్రమంలో అడ్డంకులు, వాటిని దాటి సాధించిన విషయాలను తెలియజేయనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పవన్ ప్రసంగం చిట్టచివరిది కావడంతో ముగింపు అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.



