‘జనసేన’ నాలుగవ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీపై చెలరేగిన విధానంతో పవన్ పై కౌంటర్లు మొదలైన విషయం తెలిసిందే. దానికి ప్రతీగా నేడు గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిపై తీవ్ర విమర్శలు చేసారు. నన్ను రెచ్చగొట్టవద్దు… మీరు ఒకటి మాట్లాడితే, నేను వంద మాట్లాడగలను… అంటూ ఒక స్థాయిలో మండిపడ్డారు. మరో పక్కన అధికార ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి అనేక మంది ‘జనసేన’ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల కొత్తగా విజయవాడలో ప్రారంభమైన న్యూస్ ఛానల్ మొబైల్ యాప్ ను ప్రారంభించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్, సదరు మీడియా ప్రతినిధితో కాసేపు చిట్ చాట్ చేసారు. ముఖ్యంగా లోకేష్ పై చేసిన విమర్శలపై స్పందిస్తూ… శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయట, బయట చెప్పుకుంటున్నారు, సరిచూసుకోండి అని చెప్పానే తప్ప, తాను ఉన్నట్లుగా ఆరోపణలు చేయలేదని… లోకేష్ పై చేసిన విమర్శలకు కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపించారు.
అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీబీఐను ఒక పావుగా వాడుకోవడంపై మీ అభిప్రాయం తెలపాలని, మీపై కూడా దాడులు జరిగినట్లుగా మీరు గతంలో ఓ సారి చెప్పినట్లుగా అని అంటున్న సందర్భంలో… నేను అలా ఎప్పుడూ చెప్పలేదు, నాపై దాడులేమీ జరగలేదు, కాకపోతే అలా చేస్తున్నారని ప్రస్తావించానని… గతంలో చేసిన ఆరోపణల నుండి వెనక్కి తగ్గారు. ఉదయం మాంచి దూకుడు మీదున్న పవన్, సాయంత్రం సమయానికి కూల్ గా, కాస్త నింపాదిగా కనపడడం విశేషం.
ఈ చిట్ చాట్ లో అనేక కీలక ప్రశ్నలు… జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది? ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది? ప్రత్యేక హోదాపై పవన్ స్టాండ్? ఆమరణ దీక్షపై ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు? వంటివి అడిగినప్పటికీ, “సమయం వచ్చినపుడు తాను అన్నీ చెప్తాను, ప్రస్తుతం నేను ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యి రాలేదు, మరొకసారి మీ ఛానల్ కు వస్తాను, అప్పుడు అన్నీ పంచుకుంటాను” అంటూ చెప్పారు. నిజానికి ఇలాంటి పోకడల వలనే పవన్ పై స్క్రిప్ట్ నిందలు పడుతున్నాయి.



