దాదాపు ఒక గంటపాటు సాగిన పవన్ కళ్యాణ్ అనంతపురం సభలో.., అధికార పక్షం నేత చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి చురకలు అంటించారు ‘జనసేన’ అధినేత. ముఖ్యంగా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా వినపడుతోన్న అవినీతి మరకలను సరిచేసుకోవాలంటూ చంద్రబాబుకు సూచనలతో కూడిన హెచ్చరికలు ఇచ్చారు.
ఇటీవల కాలంలో టిడిపి ప్రభుత్వంపై బాగా అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయని, ముఖ్యంగా ఒక ప్రాంతం వారికో, ఒక కులం వారికో అనుకూలంగా న్యాయం చేస్తున్నారన్న బలమైన ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల కాలంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత దక్కుతోందన్న ఆరోపణలు ఎక్కువైన నేపధ్యంలో పరోక్షంగా కులం పేరు ప్రస్తావించకుండా చంద్రబాబుకు చురకలు అంటించారు పవన్.
అలాగని జగన్ ను కూడా విడిచిపెట్టలేదు ‘జనసేన’ అధినేత. తానూ పెట్టిన బహిరంగ సభలలో చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నానని రాస్తున్న మీడియాలకు ఒక విధమైన వార్నింగ్ ఇచ్చారు పవన్. భాష సంస్కృతి లేకుండా మాట్లాడే సమకాలీన రాజకీయాలు ‘జనసేన’ చేయదూ అంటూ పరోక్షంగా జగన్ మీడియా మరియు వైసీపీ వర్గాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు పవన్. తానూ పోరాడేది విధానాల మీదే తప్ప వ్యక్తుల మీద కాదంటూ ‘జనసేన’ సిద్ధాంతాల గురించి మరోసారి స్పష్టత ఇచ్చారు.



