మెగాస్టార్ – పవర్ స్టార్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నానని పత్రికా ప్రకటన ద్వారా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన రాగానే, సర్వత్రా ఆనందం బదులు సందేహాలు వెలువడ్డాయి. దీంతో మళ్ళీ స్పష్టత ఇస్తూ… ఈ సినిమాను ఇద్దరూ ఇప్పటికే అంగీకరించారని, స్క్రిప్ట్ సిద్ధమవుతోందని తిక్కవరపు మరోసారి ధృవీకరించారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ రోజు బయటకు వచ్చింది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ను మీడియా వర్గీయులు, దీనిపై ప్రశ్నించగా… అవాక్కయ్యే సమాధానం వెలువడింది. “అన్నయ్యతో మల్టీస్టారర్ సినిమా వంటి ప్రతిపాదనలు తన దగ్గరికేమీ రాలేదని” తేల్చేసారు పవన్ కళ్యాణ్. దీంతో తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి చెప్పిన కబుర్లన్నీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అని తేలిపోయింది. అయితే కనీసం పవన్ ను కూడా సంప్రదించకుండా ప్రెస్ నోట్ విడుదల చేయడం అనేది అభిమానులను ఫూల్స్ చేయడానికేనా అని మండిపడుతున్నారు.
పవన్ తాజా ప్రకటనతో ఫ్యాన్స్ నిరాశ చెందే కంటే కూడా, వారికి ఓ స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. నిజానికి సుబ్బిరామిరెడ్డి చెప్పిన సమయంలోనే… చాలామంది ఇదంతా జరిగే విషయం కాదు, కేవలం రెండు రోజుల మీడియా హడావుడికి తప్ప… అని అభిప్రాయపడ్డారు. చివరికి పవన్ ఇచ్చిన వివరణతో అదే నిజమని తేలింది. ఇంతకీ సదరు ప్రకటన వెనుక “ఆంతర్యం” ఏమిటో సుబ్బిరామిరెడ్డి గారికే తెలియాలి.



