దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నోట్ల రద్దుకు ప్రజలు అలవాటు పడడం ప్రారంభించారు. ఎక్కువ మంది ఆహ్వానించిన ఈ నిర్ణయంపై ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తోన్న ప్రశ్న ఇది. దేశ సంక్షేమాన్ని ఆశించే పవన్ కూడా ఖచ్చితంగా మోడీ నిర్ణయాన్ని సమర్దిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఎంతమేరకు ఈ వ్యాఖ్యలు నిలుస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓ పక్కన ప్రత్యేక హోదా విషయంలో విమర్శలు చేస్తూ… మరో వైపు బ్లాక్ మనీ, ఫేక్ కరెన్సీ విషయంలో బిజెపిని ‘జనసేన’ అధినేత ఎలా సమర్ధిస్తారు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. ఇప్పటివరకు పవన్ బిజెపిని టార్గెట్ చేస్తూ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, మోడీని ఉద్దేశించి పల్లెత్తు మాట కూడా అనకపోవడం విశేషం. ఒకానొక సమయంలో దీనిపై రాజకీయ విమర్శలు వ్యక్తం కావడంతో… చేతిలో ఉన్న అన్ని ఆయుధాలు ఉపయోగించేస్తే, ఇక తానూ భవిష్యత్తులో మాట్లాడడానికి ఓపెన్ స్పేస్ ఉండదని, అందుకనే మోడీ గురించి మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు.
కానీ, తాజా పరిస్థితి అలా లేదు. తానూ ఎందుకు మోడీని అంతలా నమ్మానో అన్న విషయంపై బహుశా పవన్ ప్రకటన చేసే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మరో వైపు ఈ పరిస్థితులలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసే కన్నా, దానిని వాయిదా వేసుకుంటే ఉత్తమమేమో అన్న సలహాలను కూడా పవన్ చెవిన వేస్తున్నారని సమాచారం. మరి అదే జరిగితే పవన్ తన సభను వాయిదా వేసుకుంటారా? లేక ఎందుకు వాయిదా? అంటూ ముందుకు వెళ్తారో చూడాలి. అయితే రెండు రోజుల అనంతపురం షెడ్యూల్ అయితే ఇప్పటికే ఫిక్స్ అయ్యి ఉంది.



