పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేస్తుండటంతో రెండు చోట్ల నష్టపోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఆగిపోయి చాలాకాలమే అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా సుమారు మూడు నెలలు ఆగిపోయింది.
పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలు ముగించుకొని మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టేసరికి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు షూటింగ్ మద్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకొన్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పొంది బయటకు వచ్చినా ఏపీ ప్రభుత్వం మరో కేసులో మళ్ళీ ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు సిద్దంగా ఉంది.
చంద్రబాబు నాయుడుతో సహాయ టిడిపి ముఖ్యనేతలందరిపై మరిన్ని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని , మంత్రి రోజా స్పష్టం చేసిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో జనసేన కార్యాచరణ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక పవన్ కళ్యాణ్ మరికొంత కాలం సినిమా షూటింగ్లకు హాజరుకాలేకపోవచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిచేయలేకపోవడం వలన నిర్మాతలు నష్టపోతుండగా, సినిమాల కోసం జనసేన పార్టీకి, రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించకపోవడం వలన రాజకీయంగా ఆయన, జనసేన పార్టీ కూడా నష్టపోతున్నాయి. కనుక పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పదు.
పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నందున, పవన్ కళ్యాణ్ కనీసం ఇప్పటి నుంచి జనసేనకు పూర్తి సమయం కేటాయించకపోతే, రాజకీయాలలో మరో అవకాశం కోసం మరో 5 ఏళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది.
అయితే కొమ్ములు తిరిగిన రాజకీయనాయకులున్న టిడిపినే జగన్ రెడ్డి తుడిచిపెట్టేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తునప్పుడు, జనసేనను తుడిచిపెట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక ఎన్నికలు పూర్తయ్యేవరకు పవన్ కళ్యాణ్ తన సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి జనసేనకు పూర్తి సమయం కేటాయించడం చాలా అవసరం. లేకుంటే జనసేన అదృశ్యం అవడానికి ఎంతో సమయం పట్టదు.



