ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎన్డీయే తరపున ప్రచారం చేయడానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహారాష్ట్రలో దిగారు.
రేవంత్ రెడ్డి నాగ్పూర్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి చంద్రపూర్ చేరుకున్నారు. దారిలో ఎన్నికల అధికారుల సమక్షంలో పోలీసులు ఆయన వాహనాన్ని నిలిపి సోదాలు చేశారు.
సాధారణ సమయంలోనైతే ఓ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ని ఆపి వాహనాలు తనికీ చేస్తే అది పెద్ద రాజకీయ వివాదంగా మారుతుంది. కానీ మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాహనాన్ని కూడా పోలీసులు తనికీ చేశారు. ఆయన వారికి సహకరించారు కూడా. తద్వారా విపక్ష కాంగ్రెస్ నేతల వాహనాలు తనికీలను ఎవరూ వ్యతిరేకించలేరు. తిరస్కరించలేరు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా పోలీసులకు సహకరించారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలోనే ఏదోవిదంగా ఈ విషయాన్ని చెప్పుకొని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోందని బీజేపీని విమర్శించక మానరు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని డెగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అక్కడ హిందీ, తెలుగు భాషల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ హిందీ ప్రసంగం కాస్త చప్పగానే సాగిందని చెప్పవచ్చు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. మద్యలో మజ్లీస్ పార్టీకి భయపడే ప్రసక్తే లేదంటూ చెప్పిన డైలాగ్కి మాత్రం మంచి స్పందన వచ్చింది.
రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం దూకుడుగా సాగుతున్నప్పటికీ, మహారాష్ట్రలో కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న బిఆర్ఎస్ క్యాడర్, బీజేపీ నేతలు తెలంగాణలో రేవంత్ పాలన ఎంత దారుణంగా సాగుతోందో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం వలన బీజేపీ ఎంతో కొంత లాభపడవచ్చు తప్ప నష్టపోదు. కానీ రేవంత్ రెడ్డి ప్రచారం వలన మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందో, నష్టపోతుందో 23న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.




