జనసేన: సీజ్ ది టాపిక్..!

Pawan Kalyan Should Stop The Theatres Topic

థియేటర్ల బంద్ అంశం పై అటు సినీ పరిశ్రమకు, ఇటు జనసేనకు మధ్య జరుగుతున్న వివాదం చిలిచిలికి వైసీపీ రాజకీయం మాదిరి మారుతుంది. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అన్న పవన్ సినిమా డైలాగ్ మాదిరి ఇప్పుడు జనసేన “ఏ విషయాన్ని పట్టుకోవాలో కాదు ఏ విషయాన్ని వదిలేయాలో” కూడా తెలుసుకోవాలి అనిపిస్తుంది.

ఒక్కో సారి పవన్ నుంచి వచ్చే ప్రకటనలు చూస్తుంటే ప్రభుత్వంలో పవన్ అనుభవరాహిత్యం, జనసేన అత్యావేశం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే ప్రత్యర్థి పార్టీల నేతలకు ఖచ్చితంగా వినిపిస్తుంది.

ADVERTISEMENT

ఉదాహరణకు సనాతన ధర్మం అంటూ నాడు పవన్ చేసిన హడావుడి జనసేనకు మతం రంగు పులిమింది. అలాగే బీజేపీ సిద్ధాంతాలను జనసేన మోస్తుందా అంటూ పవన్ పై ప్రత్యర్థి వర్గాలు రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇవన్నీ కూడా ఇప్పుడే అధికారం దిశగా తొలి అడుగులు వేస్తున్న జనసేనకు అవసరం లేని విషయాలు. కానీ పవన్ దాన్ని గుర్తించలేక ఆ విషయాన్ని ఎంతవరకు ప్రచారంలో ఉంచాలి, ఎక్కడితో ఆ ప్రచారానికి ముగింపు పలకాలి అనేది ఆలోచించకుండా ముందుకెళ్లి చివరికి తన పై వచ్చిన విమర్శలకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు.

ఇప్పుడు సినీ పరిశ్రమ లో నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్ల మధ్య ఏర్పడిన పర్శంటేజ్ ల పంచాయితీలో జనసేన ‘పెదరాయుడు’ పాత్ర పోషించడానికి ముందుకొచ్చింది. దీనితో పవన్ తన పార్టీకి, ప్రభుత్వానికి అవసరం లేని మరో వివాదాన్ని నొత్తిమీదకు తెచ్చుకున్నట్టయ్యింది.

జూన్ 12 న విడుదలకు సిద్దమైన పవన్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో ‘థియేటర్ల బంద్’ అంటూ ప్రకటిస్తారా.? దీని వెనుక ‘పెద్ద కుట్ర’ దాగి ఉంది, దీనికి పూర్తి బాధ్యత ‘ఆ నలుగురే’ అంటూ జనసేన మంత్రి కందుల దుర్గేష్ ఈ వివాదంలోకి తొలి అడుగు వేశారు.

ఇక ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కార్యాలయం నుంచి కూడా ఈ వివాదానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యింది. సినీ పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను స్వాగతిస్తున్నాను అంటూనే పవన్ తన సినిమా విడుడల పై కుట్ర జరిగిన మాట వాస్తవం అనేలా ప్రకటన విడుదల చేసారు.

ఇక ప్రభుత్వ కార్యాలయం, అందునా టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన పవన్ కళ్యాణ్ నుంచి ఇంత తీవ్ర స్థాయిలో సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రకటనలు రావడంతో సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి ఆ నలుగురిలో మేము లేము అంటూ సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో జనసేన నేతల హస్తం ఉందంటూ, మొదటిగా ఈ బంద్ ప్రతిపాదన తెచ్చింది ఆయనే అంటూ దిల్ రాజు జనసేన రాజమండ్రి ఇంచార్జ్ సత్యనారాయణ పేరును వెలుగులోకి తీసుకొచ్చారు. దీనితో జనసేన ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది .

ఇక ఇప్పుడు సత్యనారాయణ వంతు వచ్చింది అన్నట్టుగా, ఆయన మీడియా ముందుకొచ్చి తనకు ఈ వివాదానికి సంబంధం లేదు, నేను పవన్ కు వీర విధేయుడిని అంటూ శీల పరీక్షకు సిద్ధమయ్యారు. ఇలా ఈ వివాదంలోకి పెదరాయుడు పాత్రలో ఎంట్రీ ఇచ్చిన జనసేన ఇప్పుడు పెద్ద సమస్యనే సృష్టించింది.

అయితే టాలీవుడ్ లో మొదలైన ఈ బంద్ తుఫాన్, జనసేన జోక్యంతో, పవన్ ప్రకటనతో ఇప్పుడు ప్రభుత్వ సమస్యగా మారి ప్రత్యర్థి వైసీపీ చేతికి చిక్కింది. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు పరిస్కారం కోసం ఎదురు చూస్తుంటే థియేటర్ల బంద్ అనే ఒక పరిశ్రమకు సంబంధించిన చిన్న సమస్యతో జనసేన పోరాటం చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదన వినిపిస్తుంది.

గతంలో జగన్ ను తప్పుపట్టిన జనసేన ఇప్పుడు పవన్ వ్యాఖ్యలను ఎలా సమర్దిస్తుంది అంటూ పవన్ కు కౌంటర్లు వేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. ఇప్పటికైనా జనసేన ఈ వివాదం నుంచి బయటపడి, పవన్ తన స్థాయికి తగ్గ అంశాల మీద స్పందిస్తే ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి లేనిపోని కొత్త తలనొప్పులు తీసుకురాకుండా ఉంటారు.

ADVERTISEMENT
Latest Stories