పవన్‌ కళ్యాణ్‌ని వేలెత్తి చూపే ముందు…..

pawankalyan

ఏపీ డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ తాజా ఇంటర్వూలో వైసీపీ రాజకీయాలు గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆలోచింపజేస్తాయి.

“మేము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలుచేస్తామని జగన్‌ చెప్పారు. కానీ అధికారంలోకి రాగానే మొట్ట మొదట మద్యం కుంభకోణంకి ప్లాన్ రెడీ చేసుకున్నారు. వైసీపీ హయంలో జరిగిన కల్తీ మద్యం అమ్మకాల వలన నిరుపేదల బ్రతుకులు చిద్రం అయ్యాయి. కల్తీ మద్యం వల్లనే జగన్‌ హయంలో ఆరోగ్యశ్రీ కేసులు గణనీయంగా పెరిగాయి.

ADVERTISEMENT

నేను 3-4 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన మూడు సినిమాలు పూర్తిచేయడానికి ఇంత సమయం పట్టింది. నా శాఖలలో పనులన్నీ చూసుకుంటూ మద్యలో తీరిక చేసుకొని మెల్లగా మూడు సినిమాలు ఒకటొకటిగా పూర్తి చేస్తున్నాను.

కానీ నేను నా శాఖలని గాలికొదిలి సినిమాలు చేసుకుంటున్నానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు సిమెంట్ ఫ్యాక్టరీలు, టీవీ ఛానల్స్, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు. కానీ అవి ఎవరికీ కనపడవు.

నేను సినిమాలు చేస్తే అవి కనబడతాయి. కనుక వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను మొదలుపెట్టిన సినిమాలు పూర్తిచేయకపోతే నిర్మాతలు నష్టపోతారు. కనుక తప్పనిసరి పరిస్థితిలో చేస్తున్నాను. ఇకపై సినిమాలు చేయగలనో లేదో తెలీదు.

వైసీపీ నేతలకి బెదిరింపులు, అబద్దాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడం, తప్పు చేసి దొరికిపోతే బుకాయించడం, ఎదురుదాడి చేసి తప్పించుకోవడం వంటివన్నీ వెన్నతో పెట్టిన విద్య. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరిక్కడ.

మీ లాంటి అరాచకవాదుల నుంచి ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే వ్యవస్తలున్నాయి. మాలాంటి రాజకీయ నాయకులున్నారు. మేము ఉన్నంతవరకు వైసీపీ వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి హానీ కలుగనీయము,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పిన జగన్‌ మద్యం కుంభకోణం కేసులో ‘ప్రధాన సూత్రధారి’ అని ఏసీబీ చెప్పేసింది. త్వరలోనే అరెస్ట్‌ చేసినా ఆశ్చర్యం లేదు. జగన్‌ ఏపీ సిఎంగా చేసినప్పుడు సాక్షి మీడియా, భారతీ సిమెంట్ కంపెనీలను మూసుకోలేదు. నష్టాలలో ఉన్న సాక్షికి సంక్షేమ పదకాల ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తూ, వాలంటీర్ల పేరుతొ రూ.2-300 కోట్లు ముట్టజెపుతూ లాభాల బాట పట్టించారు. సరస్వతీ పవర్ తదితర కంపెనీలలో వాటాల కోసం తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చారు కదా?

మంత్రులుగా చేసిన కాకాణి గోవర్ధన్, అనిల్ కుమార్‌ క్వార్జ్ గనులు కొల్లగొట్టారు. పేర్నినాని గోదాములు నిర్మించి ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చి, గోదాములో నిలువచేసిన బియ్యం మాయం చేశారు. కాకినాడ పోర్టు-బియ్యం రవాణా కధ అందరికీ తెలిసిందే. అంటే వైసీపీ నేతలందరూ ఏదో ఓ వ్యాపారాలు చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగానికి పాల్పడవచ్చు. కానీ ఎవరూ వారిని తప్పు పట్టకూడదు. కేసులు నమోదు చేయకూడదు. చేస్తే ‘రాజకీయ కక్ష సాధింపు’ అని లేబుల్ అంటించుకొని ఎదురుదాడి చేస్తుంటారు.

కనుక వైసీపీ నేతలు ముందు తమ చొక్కాలకు అంటిన ఈ బురదని ఓసారి చూసుకున్నాక, పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడటం తప్పా ఒప్పా అని ఆలోచించుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories