మొదటిసారి మోడీని విమర్శించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan Speech On Narendra Modi‘జనసేన’ అధినేతగా క్రియాశీలక రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఇప్పటివరకు కేంద్రంలో అధికారం ఉన్న బిజెపిపై, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై ప్రతి సందర్భంలోనూ నిప్పులు చెరిగారు. మోడీ మాట ఎత్తలేదు గానీ, బిజెపి తీరును తీవ్రంగా విమర్శించిన పవన్, దానిని సమర్ధిస్తున్న తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు జారీ చేసారు. అయితే నేరుగా మోడీని గానీ, చంద్రబాబు నాయుడును గానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ విమర్శించింది లేదు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పటికీ, పవన్ మాత్రం తానూ పూర్తి స్పష్టతతో మాట్లాడుతున్నానని అన్నారు.

కానీ, తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. “ఇండియాను అత్యుత్తమంగా నడిపిస్తాడని తాను ఊహించిన నరేంద్ర మోడీ క్రమంగా విఫలమౌతున్నారని, పేదల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, ధనికుల విషయంలో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నాయని” పవన్ కళ్యాణ్ విమర్శించారు. చట్టాలు బలహీనుడిపై బలంగా, బలవంతుడిపై బలహీనంగా ఉండటం ఇండియాలోని దౌర్భాగ్యంగా అభివర్ణించారు.

ADVERTISEMENT

పవన్ ఈ మాటలు పలుకగానే హార్వార్డ్ ఆడిటోరియం ఉన్న వారంతా కరతాళధ్వనులతో మారుమ్రోగించారు. ఈ పరిస్థితులను చూసి ఎంతో ఆందోళన చెందానని, ఇండియాలో 1980 ప్రాంతంలో ఇదే తరహా పరిస్థితి తనకు కనిపించిందని, ఓ వైపు పెట్టుబడిదారీ విధానం, మరోవైపు కమ్యూనలిజం, ఇంకో వైపు సోవియట్ సోషల్ రిపబ్లిక్ పనిచేస్తున్న రోజుల్లో భారత భవిష్యత్తుపై ఆందోళనగా ఉండేదని అన్నారు. తన ఇంట్లోని వైరుధ్యంతో తనకెంతో అయోమయంగా ఉండేదని, ఏ సిద్ధాంతాలతో సాగాలో తెలిసేది కాదని చెప్పారు.

కనీసం సినిమాల్లోనైనా తన ఉద్దేశాలను చూపాలని భావించి, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నించానని, విభిన్న సినిమాలు చేసినా సంతృప్తి కలగలేదని పవన్ తెలిపారు. భారతీయ సమాజానికి ఉన్న విభిన్న పార్శ్వాలు తనను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయని, స్పందన లేని సమాజం, విభజన వాదాలు తనకు నచ్చని విషయాలని, చిన్నప్పటి నుంచి విభజనలను చూస్తూనే పెరిగానని అన్నారు. తన తండ్రి బదిలీ రీత్యా వెళ్ళిన ప్రతి చోటా తనను పరాయి వాడిగా చూసేవారని, తెలుగునే తీసుకుంటే, ప్రతి 100 కిలోమీటర్లకూ భాష మారిపోతుండేదని, అది తన మనసులో బలంగా నాటుకుపోయిందని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories