డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలలో కొన్ని ఎంత ఆవేశంగా ఉంటాయో అలానే మరికొన్ని అంతే ఆలోచనాత్మకంగా ఉంటాయి అనేదానికి నిన్న రాజమండ్రి లో జరిగిన పార్టీ సమావేశం లో పవన్ చేసిన ప్రసంగమే చక్కటి ఉదాహరణ.
తన పార్టీ కార్యకర్తలను, నేతలను, తన సినీ అభిమానులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు, తమిళనాడులో విజయ్ టీవీకే విజయం పై విజయ్ సీఎం పదవి పై ఆయన చేసిన విశ్లేషణలు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో తన పై తన పార్టీ పై సాగిస్తున్న విష ప్రచారాల పై ఆయనిచ్చిన కౌంటర్లు,
అలాగే ఇక మీడియాలో జనసేన మీద జరుగుతున్న వివక్ష పై ఆయన ప్రదర్శించిన అసహనాలు, ఏపీ బీజేపీ నేతల పై పవన్ సంధించిన ప్రశ్నలు ఇలా పవన్ తన దృష్టికొచ్చిన అనేక విషయాల పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం…ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన పై, మంత్రి నాదెండ్ల మనోహర్ పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలకు పవన్ ఇచ్చిన సమాధానం, జగన్ జైలుకెళితే అన్న అంశం మీద పవన్ చేసిన విశ్లేషణ, అలాగే నాగేశ్వరరావు వ్యాఖ్యల పైన ఏపీ బీజేపీ మౌనం పై ఆయన వేసిన ప్రశ్న ఏపీ బీజేపీ నేతల చిత్తశుద్ధిని సవాల్ చేసినట్టుగా ఉంది.
నాగేశ్వరరావు తన విశ్లేషణకు ఉహాగానాలు జోడించి అందులోకి జనసేనలో పాటుగా కేంద్ర మంత్రి అమిత్ షా ను కూడా లాగడం అది నన్నో, షా నో అవమానించినట్టు కాదని, అటువంటి వ్యాఖ్యలు వ్యవస్థను అవమానించినట్టు అవుతుందని, ఇన్నాళ్లు సహనంగా, ఓపికగా ఉన్నప్పటికీ ఇక ఆ సహనం, ఓపిక ఇప్పుడు నశించిందంటూ నాగేశ్వరరావు వ్యాఖ్యలను తన పై జరిగిన రాజకీయ దాడిగా అభివర్ణించారు.
అలాగే ఈ వివాదం పై ఏపీ బీజేపీ నేతల మౌనం పై కూడా తన అంశాన్ని బయటపెట్టారు. ఏపీ బీజేపీ నేతలు ఎందుకు సదరు ప్రొఫెసర్ పై ఎదురుదాడి చేయలేకపోయారు.? బీజేపీ నేతల ఆ మౌనం వెనుక పరమార్ధం ఏమిటి.?
కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీ తమ పార్టీ కేంద్ర మంత్రి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఆ అంశం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరతీసినా ఏపీ బీజేపీ ఎందుకు స్పందించలేకపోయింది.?
అందుకు కారణాలేమిటో నాకు తెలియదు కానీ ఈ వివాదం పై ఏపీ బీజేపీ నేతల కంటే కూడా జనసైనికులే దూకుడుగా ముందుకెళ్లారు అంటూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ బీజేపీ ని ఒక రకంగా ఆత్మరక్షణలో పడేశాయనే చెప్పాలి.
ఏపీ బీజేపీ నేతలలో సింహ భాగం నేతలు పార్టీ కంటే పార్టీ నిర్ణయాల కంటే కూడా తమ వ్యక్తిగత బంధాలకు, రాజకీయ అనుబంధాలకే అధిక ప్రాధాన్యతనిస్తారు అనే వాదన ఏపీ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.




