పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని సమస్యలు, సవాళ్ళు, అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు అయన తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. కానీ నేడు హైదరాబాద్లో చిన్న సమావేశం పెట్టుకోవాలనుకుంటేనే అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకుంది కనుక పోలీసులు అనుమతి నిరాకరించారు. హైకోర్టుకి వెళ్ళినా చుక్కెదురైంది. కనుక ఇక జూబ్లీహిల్స్ నివాసంలోనే పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ దానినీ అనుమతించమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ చెప్పారు.
కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ నేతల భవిష్యత్ ముఖ్యంగా కేటీఆర్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోతుంది.
ఇక సిఎం రేవంత్ రెడ్డి మరో ఐదేళ్ళు అధికారంలో కొనసాగాలనుకుంటున్నారు. మా తదుపరి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని ప్రధాని మోడీ ఇటీవలే చెప్పి వెళ్ళారు.
ఇలాంటి పరిస్థితులలో జనసేన, టీడీపిలు కూడా వస్తే తమిళనాడులో మాదిరిగా ఓట్లు చీలిపోతాయి. అధికారం కోసం కలలు కంటున్న పార్టీలు, నేతలకు ఆందోళన చెందడం సహజమే.
కనుక తెలంగాణ పార్టీల నుంచి జనసేనకు అడుగడుగునా సమస్యలు, సవాళ్ళు, పోరాటాలు తప్పవు. ప్రధాని మోడీ ఎలాగూ ‘మిషన్ తెలంగాణ’ అన్నారు. కనుక పవన్ కళ్యాణ్ వెనుక శ్రీకృష్ణుడులా ఆయన నిలబడితే నాడు యమునా నది చీలి వసుదేవుడుకి దారి ఇచ్చినట్లు తెలంగాణ పార్టీలన్నీ దారిస్తాయేమో…. చూడాలి!




