ఈ సారి పర్ఫామెన్స్ మాములుగా ఉండదేమో?

Pawan Kalyan Varahi Yatraఉభయ గోదావరి జిల్లాలలో, విశాఖలో విజయవంతంగా ముగిసిన పవన్ వారాహి యాత్ర అక్టోబర్1న కృష్ణాజిల్లా నుండి మొదలవుతుందని జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల ప్రకటించారు. పవన్ వారాహి యాత్ర ఏపీ రాజకీయాలలో ఒక కీలక మార్పుకి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. కోనసీమలో దుమ్మురేపిన వారాహి యాత్ర విశాఖలోనూ అదే జోరుని కొనసాగించింది. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై పవన్ స్పందించిన తీరు వైసీపీ నేతల నోటికి గట్టిగానే పని చెప్పింది.

స్థానిక వైసీపీ నేతల అక్రమాలను, దౌర్జన్యాలను తూర్పారబడుతూ.., జగన్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేసిన పవన్ ప్రసంగాలు జనసైనికులనే కాదు సామాన్యుడి సైతం ఆకట్టుకుంది. నాటికి, నేటికీ రాష్ట్ర పరిస్థితులలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఇరు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటికీ సిద్దమవ్వడం, ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు బాటలు వేయడం.. .ఇలా ఈ సారి వారాహి యాత్ర అంతకు మించి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

ADVERTISEMENT

పవన్ తన విమర్శల దాడితో కొంత వరకు వైసీపీని కట్టడిచేయగలరు అనే భావనలో ఇరు పార్టీ వర్గాలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో నెలకొన్న నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదించడానికి ఈ యాత్ర ఇరు పార్టీలకు ఎంతో కీలకం. పొత్తు పొడవక ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. జనసైనికులకు తోడు బరిలోకి ఇప్పుడు తెలుగు తమ్ములు కూడా దిగడంతో ఈ సారి వారాహి పర్ఫామెన్స్ మాములుగా ఉందేమో అంటూ అటు రాజకీయ వర్గాలలో, ఇటు మీడియా వర్గాలలో చర్చ జోరందుకుంది.

అక్టోబర్1 నుండి మొదలయ్యే నాలుగో విడుత వారాహి యాత్ర కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి ప్రారంభమయ్యి మచిలీపట్నం,పెడన, కైకలూరు మీదగా సాగుతుందని నాదెండ్ల మనోహర్ షెడ్యూలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై పవన్ వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర అసహనం కలిగి ఉండడంతో ఇటు జనసైనికులతో పాటు అటు అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ యాత్రను విజయవంతం చేయడం ఖాయంగా కనపడుతుంది.

రాష్ట్రంలో అల్లర్లు – దాడులను మాత్రమే ప్రోత్సహించే వైసీపీ ప్రభుత్వం ఇక తన కుట్రపూరిత ఆలోచనలకు పదును పెట్టడం మొదలు పెడుతుందని జనసేన నేతలు వాపోయారు. విపక్ష పార్టీల నేతలు రోడ్ల మీదకు రాగానే అధికార పార్టీ నేతలు మీడియా ముందుకు రావడం ఆనవాయితీగా మారింది. “వైసీపీ నేతల దాడులకు అడ్డులేదు – ఆ పార్టీ నాయకుల నోటికి అదుపు లేదు” అనే చందంగా దిగజారిన రాజకీయ విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ కొట్టడంలో వైసీపీ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుందని పలుమార్లు రుజువు చేస్తూ వస్తుంది.

పవన్ వారాహీకి తోడు అటు లోకేష్ తన యువగళంతో, ఇటు బాలకృష్ణ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలోకి వస్తే ఈ సారి విపక్షాలు పోరాటాలకు ప్రభుత్వం తలొంచి తీరాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories