ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకొని సిఎం చంద్రబాబు నాయుడుని, టీడీపీని చావుదెబ్బ కొట్టాలని జగన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యలా మారారు. అవమానించినా, అవహేళన చేసినా, రెచ్చగొట్టినా జగన్ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కడం లేదు. పైగా ఆయనే జగన్తో ఓ ఆటాడుకుంటున్నారు.
ఇటీవల పిఠాపురం జనసేన ప్లీనరీ సభలో టీడీపీని మేమే గెలిపించామని పవన్ కళ్యాణ్ అన్న మాట పట్టుకొని వైసీపీ అల్లుకుపోదామనుకుంది. రెండు పార్టీల మద్య చిచ్చు రాజేసేందుకు మరో ప్రయత్నం చేసింది. ఇంకా ఆ ప్రయత్నాలలో ఉండగానే పవన్ కళ్యాణ్ మళ్ళీ మరో బాంబు పేల్చారు.
“నరేంద్ర మోడీ ఏవిదంగా మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టారో చంద్రబాబు నాయుడు కూడా అదేవిదంగా మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని, ఆయన నాయకత్వంలో తాను పనిచేయాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత అనుభవజ్ఞుడైన సిఎం చంద్రబాబు నాయుడు వద్ద తాను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయన్నారు” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి బయటకు రప్పించి చంద్రబాబు నాయుడుని గద్దె దించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామని ఆశపడుతున్న జగన్కి ఈ మాటలు చాలా నిరాశ కలిగిస్తాయని వేరే చెప్పక్కరలేదు. కనుక ఇప్పుడు మరో కోణంలో వైసీపీ, దాని సొంత మీడియా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో కాపు నేతలకు సముచిత ప్రాధాన్యం, గౌరవం లభించడం లేదని, కాపుల ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల వద్ద పెట్టేశారని దుష్ప్రచారం కొనసాగిస్తున్నాయి.






