ఇటీవల సిఎం జగన్ ఓ బటన్ నొక్కుడు సభలో ప్రాస బాగా కుదిరింది కదా అని ‘ములాఖాత్, మిలాఖత్’ అంటూ టిడిపి, జనసేనలను ఎద్దేవా చేస్తే, అదే ప్రాసతో ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తిరిగి దంచేశారు.
ఈరోజు శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “అసలు మీకు (జగన్) జ్ఞాపకం ఉన్నట్లు లేదు కానీ మీ వైసీపి పుట్టిందే ములాఖాత్, మిలాఖత్ నుంచి కదా?ఓ సారి గతం గుర్తుచేసుకోండి… చంచల్ గూడ జైల్లో ప్రతీరోజూ ఎన్ని ములాఖాత్, మిలాఖత్లు అయ్యేవి?
తరచూ ఢిల్లీ వెళ్ళి మీరు ఎవరితో ములాఖాత్, మిలాఖత్ అవుతున్నారో… దేనికోసం ములాఖాత్, మిలాఖత్ అవుతున్నారో అందరికీ తెలుసు. పదేళ్ళు పైగా మీ అక్రమాస్తుల కేసులలో పురోగతి లేకపోవడానికి ఢిల్లీలో మీ ములాఖాత్, మిలాఖత్లే కారణం కాదా?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి ముందు కూడా మీరు ఎవరెవరితో ఎన్ని ములాఖాత్, మిలాఖత్లు అయ్యారో ఓ సారి గుర్తుచేసుకోండి,” అని ఎద్దేవా చేశారు.
“రాష్ట్రంలో పోలీసులను పెట్టుకొని రాజ్యం చేస్తున్నారు. ఇప్పుడు శాసనసభను కూడా మార్షల్స్ సాయంతో నడిపిస్తున్నారు. శాసనసభలో సెక్షన్స్ 144, 30ఏ అమలుచేస్తున్నారు. ఎవరైనా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేస్తారు. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా?ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారు.
ఓ కేసు నమోదు చేసే ముందు దానికి సంబందించినా సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి తర్వాత సాక్ష్యాధారాలు సేకరిస్తామని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు కదా?” అని పయ్యావుల కేశవ్ నిలదీశారు.
కనుక ములాఖాత్, మిలాఖత్ పదాలను వైసీపి నేతలు మళ్ళీ ఉపయోగించడం వారికే మంచిది కాదని పయ్యావుల కేశవ్ బాగానే తెలియజేశారనుకోవచ్చు.



