ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నేడు తొలిసారిగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయజెండా ఎగురవేసి, ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించారు.
ఇటువంటి అధికారిక కార్యక్రమాలలో కొన్ని నియమ నిబంధనలు, పరిధికి లోబడి ప్రసంగించవలసి ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ ప్రసంగం కాస్త చప్పగానే సాగిందని చెప్పవచ్చు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు.
ప్రజలు మాపై నమ్మకముంచి చాలా బరువుభాద్యతలు అప్పగించారు. కనుక మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగింది. కనుక ఇప్పుడు శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నాము.
ఇంతకాలం ప్రజాసంపదని ఇష్టం వచ్చిన్నట్లు దోచుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజాసంపదని దోచుకున్నవారిని ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
విద్యార్దుల మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా మాణిక్యమ్మ పేరు పెట్టుకున్నాము. అలాగే అన్నగారి పేరుతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభంకాబోతున్నాయి.
టిడిపి కూటమి ప్రభుత్వం దృష్టి అంతా రాష్ట్రాభివృద్ధిపైనే ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంది. కనుక రాబోయే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయమైన మార్పు చూడబోతున్నాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.




