ఏపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్న తీరు చాలా ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు కాస్త అతిగానే విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి. కానీ అంతమాత్రన్న అధికారంలో ఉన్నవారు కూడా దిగజారిపోనక్కరలేదు. హుందాగానే వారికి జవాబు చెప్పవచ్చు. తద్వారా వారికే ప్రజలలో గౌరవం పెరుగుతుంది.
అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు రాజకీయాల ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారని తెలిసి కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు, తమ రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి బూతులు లేదా చాలా లేకిగా మాట్లాడుతున్నారు.
చివరికి ఓ మహిళా మంత్రి నోట్లో నుచి బూతులు తన్నుకు వచ్చేస్తుంటే ఆమె తమాయించుకొని చిర్నవ్వులు చిందించడం అందరూ చూసే ఉంటారు.
చంద్రబాబు నాయుడు రోడ్ షోలు చేస్తున్నప్పుడు లైట్లు ఆర్పేసి రాళ్ళతో దాడి చేయడం, నారా లోకేష్ మీద కోడిగుడ్లతో దాడి చేయడం ఈ వికృతరాజకీయాలకు పరాకాష్ట అనుకొంటే, కాదు…కాదు… దిగజారడానికి ఇంకా చాలా ఉందన్నట్లు, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా సమావేశంలో తన రెండు చెప్పులు తీసి చూపిస్తూ, ‘తాట తీస్తా…’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని హెచ్చరించారు.
ప్రజలకు ఆదర్శంగా మెలగాల్సిన అధికార పార్టీకి చెందిన నేతలు ఈవిదంగా మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నవారు తాటతీస్తానంటే జవాబు చెప్పకుండా ఉంటారా?ఉండరు కానీ పవన్ కళ్యాణ్ నిగ్రహించుకొని “మొన్న అన్నవరంలో నా రెండు చెప్పులు పోయాయి… అందుకే బూట్లు వేసుకొని తిరుగుతున్నాను,” అంటూ పేర్ని నానికి చురక వేశారు. సినిమాలలో పంచ్ డైలాగ్స్ చెప్పే పవన్ కళ్యాణ్ కావాలనుకొంటే ‘వైసీపీ నేతల భాష’లోనే ధీటుగా జవాబు చెప్పగలరని అందరికీ తెలుసు. కానీ ఆయన నిగ్రహించుకొంటున్నారు.
వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తుందని, అమరావతి, పోలవరం పూర్తిచేస్తుందని ప్రజలు ఆశిస్తే ఆ రెండూ ఎలాగూ చేయలేకపోయింది. కనీసం గౌరవంగానైనా వ్యవహరించాలి కదా?అదీ కష్టమేనా?వైసీపీ పాలనలో దౌర్జన్యాల గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
‘అవన్నీ ఎల్లో మీడియా పిచ్చి రాతలు, కూతలే…’ అని అనుకొన్నా మీడియా సమావేశాలలో వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు వాస్తవమే కదా?వాటిని ఏవిదంగా సమర్ధించుకొంటారు?ఆ విదంగా మాట్లాడేవారు దౌర్జన్యాలు కూడా చేస్తారని ప్రజలు భావించకుండా ఉంటారా?పదవీ, అధికారం ఉందని, ఎప్పటికీ మేమే అధికారంలో ఉండబోతున్నామనే భ్రమలో ఈవిదంగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఆ భ్రమలు తొలగించేస్తారు. కనుక ఇప్పటికైనా వైసీపీ నేతలు మేల్కొంటే వారికే మంచిది.



