వైస్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య మొదలైన ఆస్తి పంపకాల రచ్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మాట వాస్తవం. అయితే ఇది మా కుటుంబంలో జరుగుతున్న వ్యక్తిగత వివాదం…ఘర్ ఘర్ కా కహాని అంటూ వివాదం పై జగన్ మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే చెల్లి షర్మిల మాత్రం ఇది ఘర్ ఘర్ కా కహాని కాదు సర్ మన ఘర్ లో మాత్రమే జరుగుతున్న అన్యాయం అంటూ అన్న జగన్ కు గట్టి కౌంటర్ వేసింది. అయితే జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఈ ఉత్తరాల వివాదానికి చంద్రబాబుకి సంబంధం ఉంది అంటూ జగన్ తరుపున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందుకొస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికే చంద్రబాబు, షర్మిలను పావుగా వాడుకుంటున్నాడని, ఇది బాబు నీచ రాజకీయానికి నిదర్శనమని, జగన్ ను దెబ్బ తీయడానికి బాబు ఎంతకైనా దిగజారిపోతాడని, ఇటు ఎన్డీయే ప్రభుత్వంలో ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలతో చేతులు కలుపుతున్నారంటూ మీడియా ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆధారాలు లేని ఆరోపణలతో అవాకులు చవాకులు పేలుతున్నారు పేర్ని.
అయితే జగన్ ను 151 నుంచి 11 కు కుదించి ఏపీ ప్రజలు ఇప్పటికే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు అనే విషయం మాజీ మంత్రిగా మరిచినట్టున్నారు. తనకోసం, ప్రత్యర్థులతో ఎంతగా పోరాడినా, ఎంతగా దిగజారి మాట్లాడిన తన అవసరం తీరాక వారికీ జగన్ ఇచ్చే రిటర్న్ ఏ స్థాయిలో ఉంటుందో తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల విషయంలో రుజువయ్యింది.
అలాగే పార్టీ కోసం, జగన్ మెప్పు కోసం అప్పుడు చేయని తప్పుకి బాబు, పవన్ లకు నోటీసులిచ్చిన వాసిరెడ్డి పద్మ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు ఏపీ ప్రజానీకం. వైసీపీ ప్రభుత్వంలో జగన్ మాటను శిరసా వహిస్తూ చట్టాలను వైసీపీ చుట్టలుగా మార్చిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు అదే చట్టాలకు బందికాక తప్పని పరిస్థితి.
ఇక జగన్ మానసిక ఆనందానికి గత ఐదేళ్లు మానవత్వ విలువలకు నీళ్లొదిలిన బోరుగడ్డ విషయంలో వైసీపీ మాకు సంబంధం లేదని చేతులెత్తేసిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నా పేర్నినాని ఇంకా జగన్ జపం చేస్తూ వారి కుటుంబ రచ్చకు బాబు కారణం అంటూ ముఖ్యమంత్రి మీద అర్ధం పర్థం లేని ఆరోపణలకు దిగడం ఆయన అవివేకానికి పరాకాష్టగా భావించవచ్చు.
ఇది మా తండ్రి ఆస్తి, నలుగురు వారసులకు సమానంగా పంచాలన్నది మా తండ్రి గారి అభిమతం, దాని కోసమే నా ఈ పోరాటం అంటూ షర్మిల ఒక పక్క ఆ ఆస్తులన్నీ వైస్సార్ కు సంబంధించినవే అంటూ ప్రకటనలు చేస్తున్నారు. పేర్ని నాని మాత్రం ఇది జగన్ స్వార్జితం, దీనిలో భారతికి వాటా ఉంటుంది, ఈ ఆస్తుల పై పూర్తి అధికారం జగన్ దే, షర్మిలకు అడిగే హక్కు లేదు అంటూ ఒక పెదరాయుడు మాదిరి తీర్పులు వెల్లడిస్తున్నారు.
వైస్ జగన్ మోహన్ రెడ్డి కి నేను ఎల్లప్పుడూ విధేయుడనే అని నిరూపించుకోవడానికి బాబుని టార్గెట్ చేస్తూ మీడియాలో పేర్నినాని పడే తాపత్రయం చూస్తుంటే ఈయన కూడా ఎదోఒకరోజు ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాదిరి రాజకీయ కనుమరుగుకాక తప్పదు అంటూ పేర్ని భవిష్యత్ మాకు కనిపిస్తుంది మీకు తెలుస్తుందా.? అంటూ మాజీ మంత్రికి గట్టి కౌంటర్లే పడుతున్నాయి.




