గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం జరుగుతున్నా ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాకపోవడం వల్లనే ఇటువంటి మాటలు పుట్టుకొచ్చాయి.
కానీ ‘ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? ముఖ్యం,’ అన్నట్లు 2014లో తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి సుమారు లక్ష కోట్లతో కేవలం మూడేళ్ళలో పూర్తిచేసి నీళ్ళు విడుదల చేసి అపర భగీరధుడు అనిపించుకున్నారు. కానీ ఆయన కుర్చీలో నుంచి దిగిపోక ముందే మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి. అది వేరే కథ.
కానీ ఏళ్ళ తరబడి నిర్మాణ పనులు సాగుతున్న పోలవరాన్ని చూస్తున్న ఆంధ్రా ప్రజలు, తమ కళ్ళ ముందే చకచకా నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుని ఆశ్చర్యపోయారు.
‘పాలకులకు పట్టుదల, నిబద్దత ఉంటే ఏదైనా సాధ్యమే’ అని అనుకొని ఓ నిట్టూర్పు విడిచి ఊరుకున్నారు. అప్పుడు సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బటన్ నొక్కి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి వచ్చారు.
కానీ తాను కూడా పోలవరం ప్రాజెక్టుని కూడా అలా పూర్తి చేసి, కేసీఆర్లా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన చేయలేదు.
ఎందుకంటే, అలాంటి క్లిష్టమైన పనులు నెత్తికి ఎత్తుకొని బాధపడటం కంటే సింపుల్గా సంక్షేమ పధకాలతో పని కానిచ్చేయొచ్చని జగన్ మనసా వాచా నమ్మి ఆచరించడం వలన కావచ్చు. .
నాడు కళ్ళ ముందే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు పారిస్తుంటే, ఆంధ్రా ప్రజలు తమ పోలవరం పరిస్థితి చూసి బాధ పడ్డారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి చూసి తెలంగాణ ప్రజలు, కేసీఆర్, హరీష్ తదితరులు బాధపడుతున్నారు.
ఒకవేళ గేట్లు దించి నీటిని నిలువ చేస్తే మరి కొన్ని పిల్లర్లు దెబ్బ తిని డ్యాం మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడిచిపెట్టేస్తున్నారు.
అందువల్ల. ఇంకా నిర్మాణం పూర్తి కాని పోలవరం, గోదావరి నీటితో నిండుకుండలా తొణికిసలాడుతుంటే, ‘ఇంజనీరింగ్ వండర్’ అని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన నాలుగేళ్ళ తర్వాత కూడా చుక్క నీటిని నిలువచేసే పరిస్థితి లేదు. పోలవరం నుంచి అప్పుడే కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు పారుతోంది కూడా.
అయితే ఏ పని ఎవరు పూర్తి చేయాలో భగవంతుడే నిర్ణయిస్తాడని నాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ అయ్యప్ప మాల వేసుకొని శాసనసభలో చెప్పినట్లుగానే, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే పోలవరం పూర్తి కాబోతోంది.
సిఎం చంద్రబాబు నాయుడే పోలవరం పూర్తి చేసి ఆ క్రెడిట్ పొందబోతుండటం, ఆయనని అమితంగా ద్వేషించే కేసీఆర్, జగన్లు జీర్ణించుకోవడం చాలా కష్టమే. కనుక ఇలాంటి ‘స్వీట్ రివెంజ్’ పగవాడికి కూడా కలుగరాదని వారు ఆ దేవుడిని కోరుకుంటున్నా ఆశ్చర్యం లేదు.





