టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేస్తున్నప్పుడో లేదా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడో పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతుంటారు. కానీ వారి యాత్రలను అడ్డుకోవడానికే పోలీసులు వస్తుంటారు.
ఒకవేళ వారికి రక్షణగా పోలీసులున్నా వారి కళ్ళ ముందే వైసీపి కార్యకర్తలు వారిపై దాడులు చేస్తుంటారు. కానీ వైసీపి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులందరినీ టిడిపికే కేటాయించేసిన్నట్లు కనిపిస్తోంది.
ఇందుకు తాజా ఉదాహరణగా టిడిపి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటిని ఆదివారం అర్దరాత్రిని పోలీసులు చుట్టుముట్టడం కనబడుతోంది. ఆయన ఉగ్రవాదో, వేర్పాటువాదో లేదా మావోయిస్టో కాదు. ఓ సాధారణ ప్రతిపక్ష రాజకీయ నాయకుడు. కానీ ఆదివారం అర్దరాత్రి అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో ఆయన నివాసాన్ని సుమారు 50-70 మందికి పైగా పోలీసులు చుట్టుముట్టారు.
డీఎస్పీ కేవీ సత్యనారాయణ, పరవాడ సీఐ ఈశ్వరరావు పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి బండారు నివాసానికి వెళ్ళే అన్ని మార్గాలను మూసివేయించారు. గ్రామంలోకి అర్దరాత్రి ఇంతమంది పోలీసులు దిగి చేసిన ఈ హడావుడితో గ్రామస్తులు అందరూ తీవ్ర ఆందోళన చెందారు.
ఇంతకీ అర్దరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారంటే, బండారు సత్యనారాయణ మూర్తికి 41ఏ కింద నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేందుకు! ఇంతకీ ఆయన చేసిన నేరం ఏమిటంటే మంత్రి రోజాని ఉద్దేశ్యించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారట!
ఒకవేళ ఆయనకు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయదలిస్తే అర్దరాత్రిపూట రహస్యంగా రావలసిన అవసరం ఏమిటి?పగలు అందరి ఎదుటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా?అని టిడిపి నేతలు, గ్రామస్తులు అడుగుతున్నారు.
ప్రతిపక్ష నేతలకు, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్న వైసీపి ప్రభుత్వం, తమ నేతలు ప్రజల మద్యకు రాకుండా చేసేందుకు, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులను వినియోగిస్తోందని ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పోలీసులు అందరూ టిడిపి, జనసేనలను నియంత్రించడానికే కేటాయించిన్నట్లు కనిపిస్తోంది కదా?



