తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడ కోసం గత నెల చెన్నై మెరీనా బీచ్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అందులో పాల్గొన్నారని ఆరోపిస్తూ ప్రముఖ హీరో కమల్ హాసన్ అభిమానులైన సుధాగర్ అనే వ్యక్తిని, ‘కమల్ హాసన్ రసిగరల్ నర్పని ఇయక్కం’ సంఘానికి చెందిన కొంతమంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఇక ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నానని, న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. సుధాగర్ని, ఇయక్కం ఆర్గనైజేషన్కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా చెబుతూ పోలీసులు అరెస్టు చేశారని, దీని వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని, తమపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుందని అన్నారు. ఇప్పుడు మా ‘ఇయక్కం’ సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలని సూచించారు.
అరెస్టులకు గురయినప్పటికీ తన అభిమానులు ఎక్కడా హద్దులు దాటకుండా ఉండాలని, అలాగే తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పనిలేదని, ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే తమ పని అని, ప్రతిఫలం లేని ఈ బాధ్యతను ఎప్పటికీ కొనసాగిస్తామని, పాలకులు వస్తారు… పోతారు… కానీ దేశం శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.



