కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా సరిపోదు… మనదే ఇదంతా

Political corruption and scams in Telangana and Andhra Pradesh politics

ఏ ప్రాజెక్టులైనా దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతాయి. అలాగే పధకాలు, రిజర్వేషన్లు వగైరా ఆయా రాష్ట్రాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడతాయి. కానీ దేశానికి, రాష్ట్రాలకి, ప్రజలకంటే రాజకీయ పార్టీలకు వాటి నేతలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.

ఉదాహరణకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ & కో వేలకోట్లు అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తూ ఆ కేసు విచారణని సీబీఐకి అప్పగించింది. ఇది నిజమనుకుంటే ఆ ప్రాజెక్టు ప్రజల కంటే కేసీఆర్‌ కుటుంబానికే ఎక్కువ ఉపయోగపడిందన్న మాట!

ADVERTISEMENT

జగన్‌ హయంలో ఏపీలో సంక్షేమ పధకాల మోత మోగించేశారు. అవి దేనికో వైసీపీ నేతలే చెప్పుకున్నారు. అంటే పధకాలు ప్రజల కోసమా లేక పార్టీల కోసమా? ఎవరికి నచ్చిన సమాధానం వారు చెప్పుకోవాల్సిందే.

చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి, పార్టీ నేతలకి లబ్ది చేకూర్చేందుకే అమరావతి మొదలుపెట్టారని, అర్దాంతరంగా పనులునిలిపివేసిన జగన్‌, విశాఖ రాజధాని పేరుతో అసమదీయులకు ఎలా దోచిపెట్టారో అందరికీ తెలుసు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా చేయిస్తుంటే మళ్ళీ అవే ఆరోపణలు చేస్తూ ఫేక్ వీడియోలతో అమరావతిని ముంచేస్తున్నారు. సరే ఇవన్నీ వేలకోట్లతో ముడిపడిన పనులు కనుక నాలిక ఉంటే చాలు ఏదైనా ఆరోపణలు చేయవచ్చని సరిపెట్టుకోక తప్పదు.

కానీ తెలంగాణలో ‘బీసీ రిజర్వేషన్స్‌’ బీసీల కోసం కార్యక్రమంలో అధికార, ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారడం విశేషం. ఆ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్‌ పార్టీ వాదిస్తోంది.

కానీ ఆ పార్టీ విరివిగా ‘తెలంగాణ సెంటిమెంట్’ని వాడేసుకుంటోంది కనుక దానికి కౌంటరుగానే రేవంత్ రెడ్డి ఈ అస్త్రం ప్రయోగించారని కొందరు వాదిస్తున్నారు. అంటే పాత సినిమాలలో నీళ్ళు, నిప్పుల బాణాలు వేసుకున్నట్లన్న మాట! కనుక రిజర్వేషన్స్ కూడా ప్రజల కోసమా పార్టీల కోసమా?

ఇవన్నీ సరేకానీ, చివరికి అవినీతి కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళని కూడా రాజకీయ నాయకులే విరివిగా వాడేసుకొని లబ్ది పొందుతుండటం విశేషం! అవినీతి కేసు నమోదైతే ‘రాజకీయ కక్ష సాధింపు’ ట్యాగ్ తగిలించుకొని ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్ళవచ్చు.

ఒకవేళ జైలుకెళితే సానుభూతి ఓట్లు సంపాదించుకోవచ్చు. కేసులో న్యాయపోరాటాలు చేస్తుంటే రోజూ మీడియాలో ఉచిత పబ్లిసితే లభిస్తుంటుంది. ఇక కేసులన్నీ పాండవులు అజ్ఞాతవాసంలో జమ్మి చెట్టుపైన దాచి ఉంచిన అస్త్రాల వంటివే.

వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. పని పూర్తికాగానే మళ్ళీ అటక మీద పెట్టేయవచ్చు. ఫలానా నాయకుడిపై ఫలానా కేసులు కేంద్రానికివ్వాలా రాష్ట్రాలే అట్టేబెట్టుకోవాలా? ఏది లాభం ఏది నష్టం? లాభనష్టాలు ఎంత శాతం?

అని లెక్కలు కట్టుకోక తప్పడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించి, ఎఫ్‌-1 రేసింగ్ కేసుని అట్టేబెట్టుకోవడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అంటూ పరిమితులు విధించుకోకుండా,

ఈ ఆకాశం కింద ఉన్నవన్నీ రాజకీయ పార్టీల కోసమే అని కొత్త నిర్వచనం చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories