కోర్టులే కొత్త పాఠాలు నేర్చుకోవాలేమో?

court-order-judgement

ప్రతీరోజూ కొత్తరకం సైబర్ నేరాలు పుట్టుకొస్తుంటే పోలీసులు సోషల్ మీడియాలో వాటి గురించి ప్రజలకు వివరించి చైతన్యపరుస్తుంటారు.

ADVERTISEMENT

రాజకీయ నాయకులు చట్టాలలో లొసుగులను తెలివిగా ఉపయోగించుకుంటూ పోలీసులను, దర్యాప్తు సంస్థలను, కోర్టులను ముప్పతిప్పలు పెడుతూ శిక్షలు పడకుండా తప్పించుకుంటుంటే న్యాయవ్యవస్థ ఎందుకు అప్రమత్తం అవడం లేదు? అనే ప్రశ్నకు సమాధానం లభించదు.

జగన్‌, విజయసాయి రెడ్డిల 11 ఆక్రమాస్తుల కేసులలో మరో 125కిపైగా పిటీషన్లు వేసి కేసుని పక్కదారి పట్టిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణారాజు సుప్రీంకోర్టు దృష్టి తీసుకువెళ్ళి, ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరారు. కనుక ఈ కేసుల విషయంలో ఏం జరుగుతోందో సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి అవగాహన ఉందని భావించవచ్చు.

వివేకా హత్య కేసు కూడా 5 ఏళ్ళకు పైగా కోర్టులలోనే నలుగుతోంది. మరో 5-10 ఏళ్ళు సాగినా ఆశ్చర్యపోనక్కరలేదు. పురాణంలో పిట్టకధల్లా ఈ కేసులో కూడా నిందితులు అనేక పిటిషన్లు వేస్తూ ఈ కేసు విచారణ పూర్తి కాకుండా నిలువరిస్తున్నారు.

ఈ కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసు ముగింపుకి సుప్రీంకోర్టు పెట్టిన ‘డెడ్ లైన్’ (2024, జూలై నెలాఖరు)ని సుప్రీంకోర్టు చేతే ఆ ‘డెడ్ లైన్’ దాటింపజేసుకున్నారు. అంటే నిందితులు, వారి న్యాయవాదులే తెలివైనవారని అనిపిస్తుంది కదా?

ఫార్ములా 1 రేసింగ్ కేసులో నోటీస్ అందుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ కూడా నిన్న ఇటువంటి సరికొత్త ప్రయోగాన్ని విజయవంతంగా అమలుచేశారు.

న్యాయవాదులను వెంటబెట్టుకొని నిన్న ఏసీబీ విచారణకు వచ్చారు. పోలీసులు లోనికి అనుమతించరని వారికి ముందే తెలుసు. వారు ఊహించిన్నట్లే జరిగింది.

“ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయినా చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను. కానీ న్యాయవాదులతో హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించలేదు కనుక విచారణకు హాజరు కాలేను,” అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు.

అంటే విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు కేటీఆర్‌ ఓ కొత్త పద్దతి కనిపెట్టారన్న మాట! ఈవిదంగా దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్న లేదా పాలించినవారే చట్టంలో లొసుగులను ఈవిదంగా తెలివిగా వాడుకొంటూ చట్టం నుంచి తప్పించుకుంటుంటే, సైబర్ నేరాల గురించి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పుడు, న్యాయ వ్యవస్థని అప్రమత్తం చేసే యంత్రాంగం ఎందుకు లేదు?

ADVERTISEMENT
Latest Stories