మన దేశంలో ఎవరైనా వ్యక్తులు రాజకీయాలలోకి రావాలన్న, ఏదైనా ఒక రాజకీయ పార్టీని స్థాపించాలన్నా ఖచ్చితంగా ఈ నింబంధనలు పాటించాలి అంటూ ఎటువంటి షరతులు లేవు. దీనితో ఎవరు ఎప్పుడైనా పార్టీల జెండాలు మార్చేయవచ్చు, ఎవరు ఏ సందర్భంలో అయినా పార్టీలను స్థాపించేయవచ్చు.
ఈ వెసులుబాటుని అవకాశంగా తీసుకుని ఎంతో మంది రాజకియ పార్టీలను స్థాపించేస్తున్నారు. కానీ వాటిని కడ్డుబడి ఎంతకాలం ఆయా పార్టీలను నడుపుతున్నారు అనేది ఇక్కడి ప్రశ్న. మరి ముఖ్యముగా ఎన్నికల సమయంలో ఈ పిల్ల పార్టీలు పుట్టగొడుగుల మాదిరి వ్యాపిస్తూ ఇక ఎన్నికల ఫలితాల తరువాత నీటి బుడగలా మాదిరి కనుమరుగయిపోతున్నాయి.
అయితే ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో పుట్టగొడుగుల మాదిరి వెలిసి నీటి బుడగల లెక్క మాయమైన కొన్ని పార్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ముఖ్యముగా చెప్పుకోవాల్సిన పార్టీ వైస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో, వైస్ జగన్ మీద ఉన్న రాజకీయ కక్షతో తెలంగాణలో వెలిసిన వైస్ షర్మిల ‘వైస్సార్ తెలంగాణ పార్టీ’.
2021 జులై 8 న తెలంగాణలో ఆవిర్భవించిన వైస్సార్ టిపి 2023 ఎన్నికలలో పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యి తన తనువును చాలించింది. ఇక రెండవ స్థానంలో మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మి నారాయణ చేత ఆవిర్భవించబడిన ‘జై భారత్ నేషనల్ పార్టీ’.
2023 డిసెంబర్ 22 న ఆంధ్రప్రదేశ్ లో పురుడు పోసుకున్న ఈ జై భారత్ పార్టీ 2024 ఏపీ ఎన్నికల బరిలో నిలబడి ఘోర ఓటమిని మూటకట్టుకుంది. కనీసం ఈ పార్టీ పోటుచేస్తున్న విషయం కూడా ప్రజల దృష్టికి రాలేదు అంటే అతి సయోక్తి కాదు. అయితే ఎన్నికలకు ముందు ఏర్పాటైన ఈ జై భారత్ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో ఎక్కడ కనపడలేదు.
ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సింది కేఏ పాల్ స్థాపించిన ‘ప్రజా శాంతి పార్టీ’. ఈ పార్టీ పేరు కానీ ఆ పార్టీ అధినేత ఊసు కానీ ప్రతి ఎన్నికల ముందు మీడియాలో మారుమోగిపోవడం ఆ తరువాత మూగపోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే 2022 ఏప్రిల్ 15 న జడా శ్రావణ్ స్థాపించిన ‘జై భీం భారత్ పార్టీ’.
అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీగా జై భీం అవతరించింది అంటూ చెప్పిన ఆ పార్టీ అధినేత కనీసం పార్టీని ఎన్నికల బరిలోకి దింపే సాహసం కూడా చేయలేకపోయారు. అయితే ఈ పార్టీ తరుపున తమ గొంతు వినిపించడానికి కానీ, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ యొక్క స్థాయిని, స్థానాన్ని తెలియచేస్తుంది.
ఇక 2024 ఎన్నికలలో కూటమి పార్టీ విజయాన్ని అడ్డుకోవడానికి, జనసేన పార్టీ శ్రేణులను ఏమార్చడానికి ‘జాతీయ జనసేన పార్టీ’ పేరుతో ఎన్నికల ముందు పుట్టిన ఈ పార్టీ ఎన్నికల అనంతరం కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఈ కోవలోకే వచ్చి చేరుతుంది బోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన ‘భారత చైతన్య యువజన పార్టీ’. బీసీ ఓటుబ్యాంక్ ను టార్గెట్ చేస్తూ ఏపీలో వెలసిన ఈ పార్టీకి బీసీలు కూడా బై బై చెప్పారు.
ఇలా ఎన్నికల ముందు పుట్టగొడుగు మాదిరి పుట్టుకొచ్చిన ఈ పార్టీలన్ని కూడా ఎన్నికల తరువాత నీటి బుడగల మాదిరి కనుమరుగయిపోయాయి. దీని బట్టి రాజకీయాలలో రాణించాలి అంటే మంచి చెయ్యాలనే ఆలోచన ఒక్కటే సరిపోదని, కేవలం డబ్బుతోనే రాజకీయం నడపలేమని, కులాల ఆధారంగా రాజకీయంలో రాణించలేమని, రాజకీయాలంటే ఒక కామెడీ షో కాదని, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి పార్టీలు స్థాపిస్తే వారికి ప్రజలే గట్టి బుద్ది చెపుతారనేది తేలిపోయింది.





