రాజకీయాలను పార్టీలు, విధానాలకు పరిమితమై ఉన్నంత కాలం, అధికార పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నంత కాలం, రాజకీయాలలో ఉన్న ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడలేదు. కానీ ఎప్పుడైతే అధికార పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజకీయాలను వ్యక్తిగతస్థాయికి దిగజార్చాయో అప్పటి నుంచి రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ సమస్యల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు.
ఆ ఊబిలో నుంచి బయటపడాలంటే అధికారంలో లేదా అధికార పార్టీలో ఉండటం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అందువల్లే ఎన్నికలలో ఓడిపోగానే రాజకీయ నేతలు అధికార పార్టీలో చేరుతుంటారు. అందుకు వారు ఏవేవో కారణాలు చెప్పుకోవచ్చు కానీ ప్రధాన కారణం మాత్రం ఇదే అని భావించవచ్చు.
జగన్ భారీ మెజార్టీతో తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు రాజకీయ వ్యవస్థలో మంచి మార్పులు తెచ్చేందుకు గొప్ప అవకాశం లభించింది. తండ్రిలాగా మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నానని జగన్ పదేపదే చెప్పుకున్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండి ఉంటే నేడు ఆయన, వైసీపీ మహోన్నత స్థితిలో ఉండేవారు.
కానీ జగన్ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఈయడం వలన రాజకీయ వ్యవస్థని ఇంకా చెడగొట్టారు. చెడిపోయిన ఆ రాజకీయ ఊబిలో ఇప్పుడు ఆయనతో సహా వైసీపీ నేతలందరూ, వారికి తోడ్పడిన అధికారులు కూడా కూరుకుపోతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి కూడా ఇటువంటి గొప్ప అవకాశమే లభించింది. కానీ ఆయన కూడా జగన్లాగే రాజకీయాలను భ్రష్టు పట్టించేశారు.
జగన్ రాజకీయ కక్షతో రాజకీయాలను పాడుచేస్తే, కేసీఆర్ తన అధికారానికి, తన కుటుంబానికి, తన పార్టీకి ఎదురే ఉండకూడదనే దురాలోచనతో రాజకీయాలను పాడు చేశారు. ఇద్దరూ వేర్వేరు ఆలోచనలతో రాజకీయాలను పాడు చేసినప్పటికీ, అభివృద్ధి విషయంలో మాత్రం కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరించినందున నేటికీ ప్రజలలో ఆయన పట్ల నమ్మకం నిలిచి ఉంది.
ఇక టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు అదిప్పుడు అధికారంలో ఉంది కనుక దాని కత్తికి తిరుగు ఉండదు. కనుక అది కూడా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని సరిపెట్టుకోవచ్చు. అంటే జగన్ సృష్టించిన ఆ ఊబిలోకి కూటమి కూడా దిగింది కనుక దానికీ ఈ మురికి అంటుకోక తప్పదు.
అంతే కాదు.. వైసీపీ నేతల విషయంలో ఇప్పుడు దాని ప్రతీ చర్యలకు ప్రతిచర్యలు తప్పక ఉంటాయని జగన్ చెపుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ఆస్థాన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా హెచ్చరించారు.
ఆయన పల్నాడు జిల్లా వినుకొండలో మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ట్రైలర్ చూపిస్తోంది. రేపు మేము అధికారంలోకి వస్తే వారికి ఏకంగా సినిమాయే చూపిస్తాము,” అని హెచ్చరించారు.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కానీ అది అధికారంలోకి రాకుండా చేయడం కూటమి ప్రభుత్వానికి తప్పనిసరి అయ్యింది. అంటే రాజకీయాలలో ట్రైలర్లు.. సినిమాలు ఇక తప్పవన్న మాట!




