టిడిపి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా గడప గడపకి వెళ్ళిన్నప్పుడు ప్రజలు తమ సమస్యలను వారికి చెప్పుకొంటున్నారు. టిడిపి చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో వారు ప్రజలకు ఏమీ ఇవ్వకపోయినా ఆ కార్యక్రమం చాలా సజావుగా సాగిపోతోంది.
కానీ సంక్షేమ పధకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు లక్షలు కోట్లు పంచుతున్నప్పటికీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపకి వెళ్ళాలంటేనే గజగజవణికిపోతున్నారు. ఎక్కడకి వెళ్ళినా ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారు. సంక్షేమ పధకాలపై పిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రజల తిట్లు, ఛీత్కారాలు భరించవలసివస్తోంది.
గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య నిన్న తన నియోజకవర్గంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వైసీపీకి మద్దతు ఇచ్చి ఓట్లు వేసిన కొందరు ముస్లిం మహిళలు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
“నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మా పిల్లలపై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టిస్తావురా?” అంటూ కొందరు ముస్లిం మహిళలు పోలీసుల ముందే బూతులు తిడుతూ వైసీపీ ఎమ్మెల్యేకి శాపనార్ధాలు పెట్టారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి నచ్చజెప్పబోయినా వినకుండా “మీరుండండి… మేము పడుతున్న బాధ మీకు తెలీదు…” అంటూ ఆయనను పక్కకు నెట్టి, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వెంటపడి మరీ తిట్లు, శాపనార్ధాలు పెట్టారు మహిళలు.
“నేను బటన్ నొక్కి ప్రజలకి డబ్బులు పంచుతుంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళి అదే విషయం చెప్పడానికి ఏమి కష్టం?” అని సిఎం జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన నిలదీస్తుంటారు. ఆయనను ఎదిరించలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల గడప వద్దకి వెళితే ఈవిదంగా తిట్లు, శాపనార్ధాలు భరించాల్సి వస్తోంది.
కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు ఈవిషయం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పాలని ఇంతకాలం చెప్పలేకపోయారు. గడప గడపకి వస్తున్న ప్రతిస్పందనను జగనన్న టీవీలో చూశారో లేక ఎవరైనా ధైర్యం చేసి చెప్పారో తెలీదు కానీ ఇప్పుడు వారికి బదులు జిల్లా అధికారులను, కలెక్టర్లను గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు వారు తలలు పట్టుకొంటున్నారు.
అయినా ప్రభుత్వం ఇస్తున్న పధకాల గురించి ప్రజలకు చెప్పి వైసీపీకి ఓట్లు వేయమని అడగడానికి అధికారులు, కలెక్టర్లు వైసీపీ కార్యకర్తలు కారు కదా?రేపు ఇదే ప్రశ్న హైకోర్టు అడిగితే ఏం చెపుతారో?
గడప గడపకు కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సొంత పార్టీ వారి చేతిలో పరాభవం. తన రాజకీయాల కోసం, తన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసిన వారినే వేధింపులకు గురి చేస్తూ, తమ పిల్లలను అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశాడు అంటూ శాపనార్ధాలు పెట్టిన ముస్లిం మహిళలు. pic.twitter.com/LAzrCvfKyI
— Telugu Desam Party (@JaiTDP) August 26, 2022



