ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ మొన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తదితరులతో సమావేశమవడం దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే, గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమైన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. అయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆహ్వానించి సలహాలు స్వీకరించింది!
ఇటీవల 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశాంత్ కిషోర్, పార్టీలో సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమని మరోసారి రుజువైనందునే, కాంగ్రెస్ అధిష్టానం ఆ అవమానాలను దిగమింగి ప్రశాంత్ కిషోర్ని ఆహ్వానించినట్లు అర్దమవుతోంది.
వచ్చే లోక్సభ ఎన్నికలలో కనీసం 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగితేనే ఏమైనా ఫలితం ఉంటుందని, అలాగే కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మంచిదని ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. దీని కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని, పార్టీలో కీలక పదవి ఆఫర్ చేసినట్లు, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే పార్టీ పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్ళిపోవడం ఖాయమే. కాంగ్రెస్ పార్టీ మనుగడకు వచ్చే లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. కనుక ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రశాంత్ కిషోర్ అధీనంలో ఉంటుంది. అప్పుడు పార్టీలో సీనియర్ నేతల సాయంతో రాహుల్ని పక్కకి తప్పించి, ప్రశాంత్ కిషోర్ పగ్గాలు చేపట్టవచ్చు లేదా అది తొందరపాటు అవుతుందని భావిస్తే పార్టీ సీనియర్ నేతలలో తనకు అనుకూలమైన వారిని ఎవరినో ఆ కుర్చీలో కూర్చోబెట్టి చక్రం తిప్పవచ్చు. కనుక ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని ముంచుతారా ఒడ్డున పడేస్తారో చూడాలి.
ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా చేరకున్నా ఆ పార్టీ కోసం పనిచేయడం దాదాపు ఖాయం అయ్యింది కనుక ఆయన తెలంగాణ సిఎం కేసీఆర్కు హ్యాండ్ ఇస్తారా లేక కాంగ్రెస్ పార్టీతో జత కట్టిస్తారా?అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది.



