సహవాస దోషం ఎంతటి వారినైనా ఎంతకైనా దిగజార్చుతుందంటారు పెద్దలు. ఇది మంచి రాజకీయ విశ్లేషకుడుగా పేరొందిన ప్రొఫెసర్ నాగేశ్వర రావుకి కూడా వర్తిస్తుందని కూటమి వాదనలను కాదనలేము.
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన వైసీపీ రాజకీయాలను అర్థం చేసుకొని విశ్లేషించాల్సి ఉండగా, అయనే దాని చక్రవ్యూహంలో చిక్కుకోవడం విచిత్రం.
“సిఎం చంద్రబాబు నాయుడు ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని, కనుక జగన్ని అరెస్ట్ చేయడం కుదరాదని పవన్ కళ్యాణ్కి అమిత్ షా చెప్పారంటూ,” ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ.
టీడీపి-జనసేనలు పొత్తు ఆలోచనలు చేస్తున్నప్పటి నుంఛి నేటికీ వాటి మద్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కూడా తెలిసిన విషయం ప్రొఫెసర్ నాగేశ్వర రావుకి తెలియదనుకోలేము. కానీ కూటమి పార్టీల మద్య చిచ్చు పెట్టేందుకు ఆయన ఆవిధంగా ఎందుకు మాట్లాడారు?అంటే వైసీపీ వైపు మొగ్గినందునే అనుకోవాల్సి ఉంటుంది.
కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతుండటంతో అయన బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నారు.
“నాకు అందిన సమాచారాన్ని నిజమా కాదా? అని ధ్రువీకరించుకోకుండా దాని ఆధారంగా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను,” అని అన్నారు.
ఆ స్థాయి వ్యక్తి తప్పుడు సమాచారం ఆధారంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా?అంటే కాదనే చెప్పాలి. కనుక వైసీపీ ప్రభావంలో అయన ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చు.
వైసీపీతో అంటకాగిన వారిలో చాలా మంది పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జగన్ వీర విధేయ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా పలువురు జైలుకి వెళ్ళక తప్పలేదు.
అవన్నీ అక్రమ లేదా రాజకీయకక్ష సాధింపు కేసులే అని కొట్టిపడేసినా, కాపుజాతి నాయకుడుగా సమాజంలో చాలా గౌరవ మర్యాదలు అందుకున్న ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభావానికి లోనైనందుకు చివరికి అయనకి ఎటువంటి చేదు అనుభవం ఎదురైందో అందరికీ తెలుసు.
వైసీపీ కోసం ఐదేళ్ళు జీవితాలు ధారబోసి పని చేసిన లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి చివరికి ఏమైందో అందరికీ తెలుసు. ఆ జాబితాలో ప్రొఫెసర్ నాగేశ్వర రావు వంటి మేధావి కూడా చేరారు. ఎందువల్ల? అంటే సహవాస దోషం వల్లనే కదా?




