శాసనసభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వల్లనే తాము ఓడిపోయాము తప్ప ప్రజలు తమని ఓడించలేదని జగన్ తన ఓటమికి చక్కటి ముసుగు వేశారు.
అప్పటి నుంచే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తున్నారు. నేడు పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే జరుగుతున్నాయి. కనుక జగన్, వైసీపీ నేతలు ఇంట్లో హాయిగా పడుకున్నా వైసీపీ గెలిచి ఉండాలి.
కానీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాద్ రెడ్డి తదితరులు, వారి అనుచరులు పోలింగ్ జరుగుతున్న ఈ రోజు రెచ్చిపోయారు. ఇద్దరినీ గృహ నిర్బంధం చేసినా తప్పించుకొని అవినాష్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో, రవీంద్రనాద్ రెడ్డి ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చేసి చాలా హడావుడి చేశారు.
పులివెందుల జగన్, వైసీపీ అడ్డా అయినా కూడా వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందువల్ల? అంటే ఓటమి భయంతోనే.
తమ పులివెందుల అడ్డాలో టీడీపి గెలిస్తే అది వైసీపీ అభ్యర్ధుల ఓటమి కాబోదు. జగన్ ఓటమిగానే పరిగణించబడుతుంది.
అప్పుడు జగన్కు ఆగ్రహం కలిగితే వైసీపీ నేతలు భరించడం చాలా కష్టం. కనుక కష్టమైనా నష్టమైనా ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిని గెలిపించుకొని, జగన్ని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వైసీపీ నేతలు ఇంతగా రెచ్చిపోతున్నారని అనుకోవచ్చు.
కానీ బ్యాలెట్ పేపర్లతోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ వైసీపీ నేతల ఆందోళన, భయాలు చూస్తుంటే, సొంత అడ్డాలో ఇంత చిన్న ఎన్నికలను ఎదుర్కోలేకపోతే రేపు సార్వత్రిక ఎన్నికలను ఏవిదంగా ఎదుర్కోగలరు? అయినా అప్పుడూ ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే టీడీపి నేతలు, ఇదే పోలీసులు, ఇదే ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు కదా? ఇప్పుడే తడబడితే ఆ ఎన్నికలను ఎలా ఎదుర్కోగలరు?
కనుక తమకు అలవాటు అయిన బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎన్నికలను ఎదుర్కొని గెలవ వచ్చని గుడ్డి భ్రమలో కాలక్షేపం చేసే బదులు, జగన్, వైసీపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్ళి వారితో మమేకం అయ్యి వారి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తే మంచిడి కదా?




