రేపు ఆగస్ట్ 15… అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. కానీ ఇన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ చెరలో మగ్గుతున్న పులివెందులకు నేడు స్వాతంత్ర్యం లభించింది.
టీడీపి అభ్యర్ధి లతారెడ్ది తన సమీప వైసీపీ ప్రత్యర్ధి హేమంత్ రెడ్డిపై 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వైసీపీ అభ్యర్ధికి కేవలం 683 ఓట్లు లభించడంతో డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధులు కూడా డిపాజిట్లు కోల్పోయినప్పటికీ, తొలిసారిగా పులివెందులలో వారికి సైతం 100లోపు ఓట్లు పడ్డాయి. అంటే ఈసారి ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధులకు ధైర్యంగా ఓట్లు వేయగలిగారన్న మాట!
జగన్ కంచుకోటలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో వైసీపీ మూకలు రేచ్చిపోతాయని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా పోలీసులను మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దీంతో వైసీపీ చేతులు కట్టేసినట్లయింది. అందుకే ఈ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, ఎన్నికలు రద్దు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేశపడుతున్నారు.
తన విజయంపై లతా రెడ్డి స్పందిస్తూ “పులివెందులకు వైఎస్ కుటుంబం నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నుంచి నేడు విముక్తి లభించింది. వారికి ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం వచ్చింది. నా గెలుపు కోసం ఎంతగానో శ్రమించిన టీడీపి నేతలకు, కార్యకర్తలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం, ఒంటిమిట్టలో 86 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మరికొద్ది సేపటిలో ఫలితాలు ప్రకటించనున్నారు.






