ఈ నెల 12న కడప జిల్లా పులివెందుల రూరల్ మండలంలో జెడ్పీటీసీ ఉపఎన్నిక జరుగబోతోంది. కానీ టీడీపి, వైసీపీల హడావుడి చూస్తుంటే జెడ్పీటీసీ ఉపఎన్నిక కాక జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల శాసనసభకు ఉప ఎన్నిక జరుగుతోందా? అని సందేహం కలుగుతోంది.
రెండు పార్టీలు ఈ స్థానం దక్కించుకోవడం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి.
పులివెందుల అంటే జగన్ అడ్డా… అక్కడ ఎవరూ నోరెత్తడానికి లేదు. పులివెందులలో చాలా కాలంగా ఇలాగే సాగుతోంది. అటువంటి పులివెందుల కంచుకోటలోకి టీడీపి జోరబడి దానిని బద్దలుకొట్టాలని టీడీపి చాలా పట్టుదలగా ఉంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడి రాజకీయ మూలాలు దెబ్బ తీయలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వుతూ ‘వైనాట్ కుప్పం?’ అనేవారు. నాడు కుప్పం కంచుకోటలోకి వైసీపీ సేనలను పంపించి ఏవిదంగా బద్దలు కొట్టాలని ప్రయత్నించారో ఇప్పుడు టీడీపి కూడా అదేవిదంగా ప్రయత్నిస్తోంది.
కనుక ఓడితే జగన్ పరువు పోతుంది. గెలిస్తే టీడీపి కంచుకోటలో అల్లుకుపోతుంది. కనుక ఇది పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికన్నట్లు రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు మరిచిపోయిన న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నీ ఇప్పుడు వైసీపీకి గుర్తుకు వస్తున్నాయి. అవన్నీ ఉన్నా లేకపోయినా ఈ కంచుకోట యుద్ధంలో వైసీపీ గెలిచి తీరాలి.
కనుక ఆనాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు జగన్ ఏవిదంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిని రంగంలో దించారో, ఇప్పుడు అదేవిదంగా ఈ ఉప ఎన్నిక కోసం బొత్స సత్యనారాయణ చేత మాట్లాడించి ఆ పెద్దాయనని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు.
‘బిగ్ బాస్’ మాట కాదనలేక విజయనగరంలో ప్రెస్మీట్ పెట్టి, “లోకంలో ఇంత అన్యాయం, అక్రమం ఎన్నడూ చూడలేదని” బొత్స ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఈ ఉప ఎన్నికలో టీడీపి గెలిచినా ఓడినా ‘వైనాట్ పులిచింతల’ అంటే ఎంత బాధ కలుగుతుందో ఉంటుందో జగన్ అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగేలా చేస్తోంది. టీడీపికి ఈ సంతృప్తి చాలు కదా?




