బ్యాలట్ బాక్స్ లో పులివెందుల వినతులు…

Pulivendula ZPTC by-election ballot box with public petitions

నేడు జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు ఎన్నో వాస్తవాలను బయటకు తేవడంతో పాటుగా మరెన్నో ప్రజల ఆకాంక్షలను బహిర్గతం చేసింది.

మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో ఏకగ్రీవాలకు ఫుల్ స్టాప్ పడింది, బ్యాలట్ పద్దతిలో ఓటింగ్ జరిగింది. ఇందుకు గాను టీడీపీ, వైసీపీ తో సహా మొత్తం 11 నామినేషన్లు పులివెందుల ఓటర్లను పలకరించాయి.

ADVERTISEMENT

అయితే ఇన్నేళ్ల ప్రజాస్వామ్య సంకెళ్లను ఓటింగ్ తో స్వేచ్ఛ వచ్చింది, టీడీపీ గెలుపుతో పులివెందుల ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందంటూ టీడీపీ సంబరాలు చేసుకుంటుంటే ఇన్నేళ్ల తమ నియంత దాహానికి ఒక మహిళ చేతిలో చెక్ పడింది అంటూ వైసీపీ ఆక్రోశిస్తుంది.

అయితే రాజకీయంగా టీడీపీ గెలిచినా, వైసీపీ ఓడినా, ఈ ఎన్నికల ద్వారా ఇక్కడి ప్రజల ఆవేదన, ఆకాంక్ష లోకానికి తెలిసొచ్చింది. 30 ఏళ్ళ తరువాత తానూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చాను, ఈ అవకాశానికి అందరికి దండాలు అంటూ బ్యాలట్ బాక్స్ లో ఒక చీటి ప్రత్యక్షమయ్యింది.

దీనితో ఇన్నాళ్లు వైఎస్ కుటుంబ ఏకగీవ నిర్ణయాలతో పులివెందుల ప్రజలు ఎంతగా అలసిపోయారో అన్న విషయం రాష్ట్రం మొత్తానికి తెలిసొచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా బ్యాలట్ బాక్స్ లో మరో చీటి దర్శనమిచ్చింది.

‘మా వివేకా సార్ కి న్యాయం చెయ్యండి సార్’ అంటూ రాసిన ఒక చీటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో వైస్ వివేకా హత్య అక్కడి ప్రాంత ప్రజలను ఎంతలా కలచివేసిందో, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారిలో ఎంతటి నిస్సహాయతను తెచ్చిపెట్టాయో అన్న ఆవేదన లోకానికి తెలిసింది.

అయితే ఈ చిటీలను టీడీపీ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకుంది. అంటే పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తడానికి కూడా సాహసించలేకపోతున్నారా.?

అందుకే చేతికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని వారు వారికీ అనుకూలంగా మలచుకోవాలని ఆశపడ్డారా.? అందులో భాగంగానే ఈ వినతులు, విన్నపాలు బ్యాలట్ బాక్స్ ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రజలకు చెప్పదలచుకున్నారా.?

ఇన్నాళ్లు నామినేషన్ వేసేందుకు కూడా సాహసించని ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు లతా రెడ్డి అనే మహిళ గెలుపు ద్వారా ఏకంగా వైస్ జగన్ ఇలాకాలో పసుపు జెండా ఎగరేసే స్థాయికి వచ్చారు, అలాగే మరికొంతమంది వైసీపీ, టీడీపీ లకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసే సాహసం చేయగలిగారు.

అయితే పులివెందుల ప్రజల ఓట్లతో వైసీపీ ని మట్టికరిపించిన టీడీపీ ఆ ఓట్లకు న్యాయం చేయాలి, వారి వినతులను, విన్నపాలు పరిశీలించి పరిష్కరించాలి. అప్పుడే టీడీపీ గెలుపుకి, పసుపు జెండా మీద ఉంచిన నమ్మకానికి నిజమైన అర్ధం పరమార్థం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories