జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్తో భేటీ అయ్యి వైసీపిని కాంగ్రెస్లో విలీనం చేసేస్తారని వచ్చిన వార్తలపై వైసీపి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ చేసిన సవాళ్ళు జగన్ కొంప ముంచేలా ఉన్నాయి.
“జగన్ని 16 నెలలు జైల్లో పెడితేనే భయపడలేదు. ఎన్నికలలో ఓడిపోతే భయపడతారా?నారా లోకేష్, రేవంత్ రెడ్డిలకు భయపడి వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నవారందరికీ ఇదే సవాలు విసురుతున్నాను.
జగన్మోహన్ రెడ్డి ఎక్కడికీ వెళ్ళరు. వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఇక్కడ తాడేపల్లిలోనే ఉంటూ రాజకీయాలు, పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఎన్నికల హామీలను అమలుచేయమని చంద్రబాబు నాయుడు రోజూ నిలదీస్తూనే ఉంటారు. ఆయన దుష్ట పాలనపై పోరాడుతూనే ఉంటారు.
లోకేష్ ఎర్ర డైరీ చూసి మేము భయపడిపోతామని అనుకోవద్దు. నీకు (చంద్రబాబు నాయుడు)కి చాతనైంది చేసుకో. జగన్ని ఎన్నేళ్లు జైల్లో పెట్టుకుంటావో పెట్టుకో. జగన్ తగ్గితే కదా?” అంటూ పేర్ని నాని సవాలు విసిరారు.
జగన్ గురించి నిన్న మీడియాలో వచ్చిన ఇతర వార్తలపై కూడా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పేర్ని నాని ఈ స్థాయిలో స్పందించడం యాదృచ్చికమని అనుకోలేము. జగన్ సూచనల మేరకే ఈవిదంగా ఎదురుదాడి చేస్తున్నట్లు భావించవచ్చు.
ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయంతో తర్వాత పార్టీలో విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా వంటి పలువురు సీనియర్ నాయకులు మీడియాకు మొహం చాటేస్తున్నారు.
వారి మౌనంతో ప్రజలకు, ముఖ్యంగా వైసీపి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో ప్రతీరోజూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కొత్త ప్రభుత్వం గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇక ముందు ఏమి చేయబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కనుక వారి ఆసక్తిని బ్రేక్ చేసి మళ్ళీ వైసీపివైపు తిప్పుకోవడానికే ‘దమ్ముంటే జగన్ని జైల్లో పెట్టమని’ పేర్ని నాని సవాల్ విసిరిన్నట్లు భావించవచ్చు.
కానీ ఇప్పటికిప్పుడు టిడిపి ప్రభుత్వం ఆ పని చేయదు కనుక “చూశారా… జగన్ ఎంత ధైర్యవంతుడో? కనుక జగన్ ఉండగా వైసీపి నేతలు, కార్యకర్తలకు ఏ సమస్య రాదని పేర్ని నాని చేత చెప్పించిన్నట్లు భావించవచ్చు. కానీ పైన తధాస్తు దేవతలుంటారని పేర్ని నాని గ్రహిస్తే మంచిది.




