Putin vs Trump: War of Strategies

పుతిన్, ట్రంప్‌ యుద్ధరీతులు వేరు కానీ…

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి ప్రపంచ దేశాలలో అశాంతి సృష్టిస్తే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సుంకాల యుద్ధం ప్రకటించి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నారు.

Also Read – కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?

పుతిన్ చేస్తున్న యుద్ధంలో ప్రత్యక్షంగా వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు ట్రంప్‌ మొదలుపెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో కూడా అదే జరుగబోతోంది.

అమెరికా తలుపులు మూసేయడంతో వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, వివిద పరిశ్రమల ఉత్పత్తులు, ఐటి సేవలు నిలిచిపోతాయి. ఆ కారణంగా ఆయా రంగాలు, వాటిలో పనిచేసేవారు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్‌ వెనక్కు తగ్గకపోతే ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మరింత పెరిగి, ఆర్ధిక సంక్షోభానికి దారి తీసే ప్రమాదం పొంచి ఉంది.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

కనుక పుతిన్, ట్రంప్‌ ఇద్దరూ చేస్తున్నది భిన్నమైన యుద్ధాలైనప్పటికీ వాటి అంతిమ ఫలితాలు మాత్రం ఇంచుమించు ఒకేలా ఉండొచ్చు.

అమెరికా వివిద ఔషదాల కోసం భారత్‌తో సహా వివిద దేశాలపై ఆధారపడి ఉన్నందున వాటిపై సుంకాలు విధించలేదు. కానీ త్వరలో వాటిపై కూడా సుంకాలు తప్పవని ట్రంప్‌ హెచ్చరికతో భారత్‌ ఫార్మా రంగం షేర్స్ తీవ్ర ఒడి దుడుకులకు లోనవుతున్నాయి.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

ఇక అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చిన విదేశీ విద్యార్ధులపై ట్రంప్‌ సర్కార్ కొరడా ఎందుకు ఝుళిపిస్తోందో తెలీదు కానీ చిన్న చిన్న కారణాలతో వారిని అమెరికా విడిచిపెట్టి పోవాలని ఈమెయిల్స్ పంపిస్తుండటంతో విద్యార్ధులు, లక్షల ఖర్చు పెట్టి అమెరికా పంపించిన వారి తల్లితండ్రులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

విద్యార్ధులను ఇలా అర్ధాంతరంగా పంపించివేస్తుండటంతో అమెరికన్ యూనివర్సిటీలకు కూడా ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ కారణంగా ఇకపై విదేశీ విద్యార్ధులు అమెరికాలో చదువుకునేందుకు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని యూనివర్సిటీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.

అయితే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్, ట్రంప్‌ అనుచిత నిర్ణయాలను తెలివిగా ఉపయోగించుకుంటే భారత్‌ ఎంతో లబ్ధి పొందవచ్చని చెపుతున్నారు.

అమెరికా-చైనా మద్య జరుగుతున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికన్, యూరోపియన్ పరిశ్రమలను భారత్‌ ఆకర్షించవచ్చన్నారు. కనుక భారత్‌ కూడా పరిశ్రమలు, పెట్టుబడులు, సుంకాల విషయంలో మరింత సరళమైన విధానాలు ప్రవేశపెట్టేందుకు ఇదే తగిన సమయమని రంగరాజన్ అన్నారు.

ట్రంప్‌ నిర్ణయాల కారణంగా నష్టపోతున్న దేశాలతో భారత్‌ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు. తద్వారా భారత్‌తో సహా ఆయా దేశాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చని రంగరాజన్ సూచించారు.

చైనా ప్రభుత్వం ట్రంప్‌ అహం దెబ్బతినే విదంగా వ్యవహరిస్తోంది కనుక అమెరికా దిగుమతులపై భారత్‌లో సుంకాలు తగ్గిస్తే, ట్రంప్‌ భారత్‌ ఎగుమతుల పట్ల సానుకూలంగా స్పందిస్తారని రంగరాజన్ సూచించారు.




ఏది ఏమైనప్పటికీ ట్రంప్‌ మొదలుపెట్టిన ఈ వాణిజ్య యుద్ధం వలన భారతీయ ఆర్ధిక వ్యవస్థని, మార్కెట్స్ దెబ్బ తినకుండా కాపాడుకోవాలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.