అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన ఓ ఎంపీని అదే రాష్ట్రానికి చెందిన సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లు ఎప్పుడూ విని ఉండము. అలాగే ఓ ఎంపీని తన రాష్ట్రంలో తన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేసిన ప్రభుత్వం ఒకటి దేశంలో ఉందని ఎప్పుడూ విని ఉండము. ఏపీలో వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గురించే ఇదంతా.
ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి, విధానాలను వ్యతిరేకించి దూరం అయినప్పటి నుంచి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఆయనను వైసీపీ నుంచి బహిష్కరించలేదు! ఆయన కూడా వైసీపీ ప్రభుత్వం దాష్టీకాల నుంచి తనను కాపాడుకోవడానికి ఎంపీ అనే కవచం అవసరమని భావిస్తున్నందునేమో ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు.
పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నందుకు, వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేసి సీఐడీ పోలీసుల చేత చిత్రహింసలు పెట్టినప్పుడు ఆయనను ఆ ఎంపీ కవచం కాపాడలేకపోయింది. తెలంగాణలో ఎంపీ బండి సంజయ్ కాలర్ పట్టుకొన్నందుకే కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి, సంబందిత పోలీసు అధికారులకు నోటీసులు పంపి సంజాయిషీ కోరింది. కానీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ పోలీసులు అరికాళ్ళు వాచిపోయేలా లాఠీలతో కొట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరమే. బహుశః వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంది కనుక చూసి చూడనట్లు ఊరుకొందేమో?
అయితే రఘురామ కుమారుడు భరత్ తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసలు చేయడంపై సుప్రీంకోర్టులో దావా వేసి సీబీఐ విచారణ కోరారు. వైసీపీ ప్రభుత్వం తన తండ్రిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా రెండున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆయనకు సూచించింది. కానీ తాము ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నామని భరత్ తరపు న్యాయవాది చెప్పగా, ముందు ఏపీ ప్రభుత్వ వివరణ కూడా విన్నాక సీబీఐ దర్యాప్తు గురించి నిర్ణయం తీసుకొంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వాన్ని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చినందున ఈ ‘కస్టోడియల్ టార్చర్’ గురించి సుప్రీంకోర్టులో వివరణ ఇచ్చుకోకతప్పదు. ఒక ఎంపీని చిత్రహింసలు పెట్టడం, ఆయనను రాష్ట్రంలో, నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం రెండూ చాలా తీవ్రమైన నేరాలే. కనుక దీనికి వైసీపీ ప్రభుత్వం ఏం కధ అల్లిచెపుతుందో చూడాలి.



