రాజకీయాలలో స్నేహానికి, బంధానికి, బంధుత్వానికి…అలాగే శత్రుత్వానికి శాశ్వత కొలమానం అంటూ ఏమి ఉండదు. రాజకీయాలలో ఎవరు ఎప్పుడైనా, ఎవరికైనా హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే ఈ పొలిటికల్ కెరియర్ లో నమ్మిన బంటు అంటూ ఎవరు ఎవరికీ ఉండరు కూడా.
విషయానికి వస్తే..,తాజాగా కొందరు బిఆర్ఎస్ నాయకులు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రితో భేటీ అయ్యాం అంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మీడియా సాక్షిగా వివరణ కూడా ఇచ్చారు.
అయితే “కందకు లేని దురద కత్తిపిట్టకు ఎందుకు” అన్నట్టుగా రేవంత్ ను కలవడం పై బిఆర్ఎస్ అధిష్టానానికి లేని అభ్యంతరం బీజేపీ పెద్దలకు ఎందుకో తెలియదు కానీ…,బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వీరి కలయిక మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, ఆ సీటు తనకే కావాలని కేసీఆర్ కూతురు కవిత పట్టుబడుతున్నారంటూ చెప్పుకొచ్చారు.
అక్కడితో ఆగకుండా దీనికి చెక్ పెట్టేందుకే హరీష్ రావు మెదక్ జిల్లా ఎమ్మెల్యే లను కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు పంపించి తిరిగి వారితోనే ప్రెస్ మీట్ పెట్టించారంటూ బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారంటూ బిఆర్ఎస్ గుట్టు రట్టు చేసారు రఘునందన్. బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేతలతో ఒకరుగా ఉన్న హరీష్ రావు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు రఘునందన్.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీ పై ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయో వేచి చూడాలి. రఘునందన్ వ్యాఖ్యలు దృష్ట్యా “కేసీఆర్ కు హరీష్ రావే నిజమైన కట్టప్పగా” మారబోతున్నారా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.




