మోడీ నా మిత్రుడు అంటూనే అయన పాలనని కించపరిచే విదంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచనలన వ్యాఖ్యలు చేస్తే, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే, “రష్యా, భారత్ కలిసి ఏం చేసుకుంటాయో నాకనవసరం. భారత్ రష్యాల రెండు ఆర్ధిక వ్యవస్థలు చచ్చినవే. (డెడ్ ఎకానమీ). ఆ చచ్చిన ఆర్ధిక వ్యవస్థలను ఆ రెండు దేశాలు ఇంకా కిందకు తీసుకుపోతున్నాయంతే.
ప్రపంచంలోనే అత్యధిక శాతం పన్నులు భారత్ విధిస్తోంది కనుక ఆ దేశంతో వాణిజ్యం పెద్దగా లేదు. రష్యాతో కూడా అదే పరిస్థితి,” అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒకవేళ భారత్ది ‘డెడ్ ఎకానమీ’ అయితే దాని గురించి ట్రంప్ ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మాట్లాడుతున్నారంటే అర్ధం భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందనే.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ ఏ దేశానికైనా అతిపెద్ద మార్కెట్టే. కనుక భారత్లోకి చైనా, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు ప్రవేశించి లాభాలు తీసుకోగలుగుతున్నాయి కానీ అమెరికా ప్రవేశించలేకపోతోంది! ఎందుకో ట్రంపే ఆలోచించుకోవలసి ఉంది.
అలాగే భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉంది కనుకనే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వేలు, లక్షల కోట్లు విలువగల ఆయుధాలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు కొనగలుగుతోంది కదా?ఆ వ్యాపార అవకాశం పూర్తిగా తమకు దక్కనందుకే ట్రంప్ అక్కసు.
అందుకే భారత్ వేగంగా ఎదగనీయకుండా పక్కలో బల్లెంలా చైనా, పాకిస్తాన్లు బలంగా ఉండేందుకు అమెరికా ఎప్పుడూ వాటికి సాయపడుతూనే ఉంటుంది.
భారత్పై 25 శాతం పన్ను, అదనంగా జరిమానా విధించిన ట్రంప్, పాకిస్తాన్తో కలిసి ఆ దేశంలో ముడి చమురు తీస్తామని ప్రకటించడమే ఇందుకు తాజా నిదర్శనం.
భారత్ వ్యవస్థ అద్భుతంగా లేనప్పటికీ దయనీయంగా లేదనే చెప్పాలి. కానీ ట్రంప్ ‘భారత్ది డెడ్ ఎకనామీ’ అంటూ చులకనగా తీసి పడేస్తే, భారతీయులకు బాధ కలుగుతుంది.
కానీ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతించారు. ఆయన ధైర్యంగా నిజమే చెప్పారని మెచ్చుకున్నారు.
మోడీ పాలనలో భారత్ ఆర్ధిక వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించేసి ‘డెడ్ ఎకానమీ’గా మార్చేశారని రాహుల్ అన్నారు. ఈవిషయం దేశంలో అందరికీ తెలుసని, ఇప్పుడు అదే మాట ట్రంప్ చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్కు ముఖ్యంగా… రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ శత్రువు కనుక ఆయనపై వచ్చే ప్రతీ విమర్శని స్వాగతిస్తారు. వీలైతే తాను కూడా ఇలా మరో రెండు ముక్కలు వేసి విమర్శిస్తుంటారు.
‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత యావత్ ప్రపంచదేశాలు భారత్ శక్తి సామర్ధ్యాలను ప్రశంశిస్తే, ఖర్గే, రాహుల్, ప్రియాంకలు మాత్రం మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఇందుకు మరో చక్కటి ఉదాహరణ.
కానీ పదేళ్ళ యూపీయే హయంలో దేశ ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, ఎన్ని కుంభకోణాలు జరిగాయో, ఎన్ని ఉగ్రదాడులు జరిగాయో అందరూ కళ్ళార చూశారు.
అలాగని ప్రధాని మోడీ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. మోడీ హయంలో ఆర్ధిక వ్యవస్థ ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయిందనీ కాదు. కానీ ఉండవలసిన ఎత్తులో ఉండకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ కంటే మెరుగుగానే ఉందని అందరికీ తెలుసు.
భారత్ ఏయే దేశాలతో వాణిజ్యం చేయాలో దేనితో చేయకూడదో ట్రంప్ నిర్దేశిస్తూ భారత్పై జరిమానాలు విధిస్తుంటే, భారత్ ఆర్ధిక వ్యవస్థని చులకన చేసి మాట్లాడుతుంటే రాహుల్ గాంధీకి సంతోషం కలగడం చాలా బాధాకరమే… కదా?






