ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో అవే చెపుతున్నాయిగా!

Rajadhani-Files-Vyooham-Yatra2

ప్రతీ సినిమా వెనుక దర్శకుడు, నటీనటులు, అనేకమంది శ్రమ, నిర్మాతల పెట్టుబడి ఉంటుంది కనుక సినిమా యావరేజ్‌గా ఉన్నా దానిని కాపాడుకుని ఒడ్డున పడేందుకు, ప్రెస్‌మీట్లు, సక్సస్ మీట్లు పెట్టుకుని తమ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకుంటారు. దానిని ఎవరూ తప్పుపట్టలేము. కానీ ఓ సినిమా హిట్ అయ్యిందో లేదో ప్రేక్షకులే తేల్చి చెపుతారు.

అదేవిదంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపి పాలన అద్భుతంగా ఉందని, దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రజలందరికీ ‘మేలు’ చేశాము కనుక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, మళ్ళీ మనల్నే 175/25 సీట్లు ఇచ్చి గెలిపిస్తారని సిఎం జగన్మోహన్‌ రెడ్డి పదేపదే చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT

తన పరిపాలన బాగుందనే ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటారు. కేసీఆర్‌ కూడా అలాగే అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అలా అనుకోలేదు. కనుకనే గద్దె దించేశారు.

అయితే తమ పార్టీ, ప్రభుత్వం, పాలన, విధానాలు, నిర్ణయాల గురించి ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్మోహన్‌ రెడ్డికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నేతలకు తెలియదనుకోలేము. కానీ ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకుంటూ ‘ఆల్ ఈజ్ వెల్’ సాంగ్ పాడుకుంటున్నారు. అది వారిష్టం!

నిజంగా వైసీపి ‘ఆల్ ఈజ్ వెల్’ అయితే ఎన్నికలకు ముందు పార్టీలో ఈ మార్పులు చేర్పులు అవసరమే లేదు కదా?కనుక ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అని అర్దమవుతూనే ఉంది…. అని గ్రహించేందుకు నిదర్శనంగా మూడు సినిమా ట్రైలర్స్ మన ముందున్నాయి.

ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయాలనే ఆలోచనతోనే ‘వైసీపి బ్యానర్‌’లో వ్యూహం, యాత్ర-2 సినిమాలను సిద్దం చేయగా, వైసీపి ప్రభుత్వ పాలన, నిర్ణయాలు, విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ పరిస్థితి, ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్ణయం, రాష్ట్రంపై దాని ప్రభావం, రైతుల ఆవేదన, పోరాటాలను వివరిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ ‘రాజధాని ఫైల్స్’ పేరుతో సినిమాలు తీశాయి.

వాటిలో ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా డిసెంబర్‌లో విడుదల కావలసి ఉండగా, తెలంగాణ హైకోర్టు దానిపై స్టే విధించి ఆ సినిమాను సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని కూడా తప్పు పట్టింది. యాత్ర-2 సినిమా ఈనెల 8న, రాజధాని ఫైల్స్ 15న విడుదల కాబోతున్నాయి.

ఈ మూడు సినిమాల ట్రైలర్స్ విడుదలయ్యాయి. వాటిలో సుమారు 2 నెలల క్రితం విడుదలైన ‘వ్యూహం’ ట్రైలర్‌కు 5.6 మిలియన్ వ్యూస్ రాగా, రెండు రోజుల క్రితం విడుదలైన యాత్ర-2 ట్రైలర్‌కు 4.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ 21 గంటల క్రితం విడుదలైన రాజధాని ఫైల్స్ ట్రైలర్‌కు ఏకంగా 6.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఈ మూడింటికీ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే, జగన్‌ ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారో అర్దమవుతుంది కదా?మళ్ళీ వేరే సర్వేలు దేనికి?ఇంకా ప్రగల్భాలు దేనికి?అంటే, ముందు చెప్పుకున్నట్లు ఫ్లాప్ సినిమాని బ్రతికించుకునే ప్రయత్నంవంటిదే అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories