ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. కొత్త సంవత్సరం కూత వేటులో ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం ప్రకటించారు. చెన్నైలో ఆరో రోజు అభిమానులతో సమావేశమైన రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు.
డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. దేవుడిదయ వల్ల మీ ఆశీస్సుల వల్ల సినిమాలలో బానే సంపాదించని అని ఆయన చెప్పుకొచ్చారు. “తమిళనాడు రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు హేళన చేసి మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను,” అని రజినీకాంత్ చెప్పారు.
రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలు చేయడం అంత సులువు కాదని, ‘గెలిస్తే విజయం.. లేదంటే మరణం’ అని వ్యాఖ్యానించారు. సమయం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అప్పుడు నిర్ణయిస్తా అని తెలిపారు.
తలైవా పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. అయితే జయలలిత మరణం తరువాత క్లిష్టంగా మారిన రాజకీయాలు మరింత క్లిష్టంగా మారబోతున్నాయి. ఇప్పటికే వస్తున్నా అని చెప్పిన కమల్ హసాన్, ఇప్పుడే ప్రకటించిన రజినీకాంత్ ఏ మేరకు ప్రభావితం చెయ్యగల్గుతారో చూడాలి.



