త్వరలో ఎన్నికలు జరుగబోతున్న మూడు రాజ్యసభ సీట్లను వైసీపికి ఉన్న ఎమ్మెల్యేల బలంతో అవలీలగా గెలుచుకోగలదు. కానీ లోక్సభ ఎన్నికలకు ముందు జరుగబోతున్న ఈ ఎన్నికలను టిడిపి ‘గేమ్ చేంజర్’గా మార్చుకోవాలని భావిస్తోంది.
ఒక్కో ఎంపీని గెలిపించుకునేందుకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్ టిడిపిని వీడి వైసీపిలో చేరారు. గత ఏడాది వైసీపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి, ఆనం రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వచ్చి టిడిపిలో చేరారు.
తాజాగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరలో టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక టిడిపి వద్ద 23-24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనుక కనీసం మరో 20-22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ను బరిలో దించబోతోంది!
జగన్మోహన్ రెడ్డి వైసీపిలో చేస్తున్న మార్పులు చేర్పులతో ఆ పార్టీలో 10-12 మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్లోకి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు కాకుండా మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. అంటే సుమారు 20-25 మంది అవసరంకాగా అంతకంటే ఎక్కువ మందినే కూడగట్టగలమని టిడిపి నేతలు నమ్మకంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే టిడిపి తరపున కంభంపాటి రామ్మోహన్ను బరిలో దించుతున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ ఈ ఎన్నికలలో కంభంపాటి రామ్మోహన్కు వైసీపి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించుకుని గెలిపించుకోగలిగితే, ఇది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. పార్టీలో అంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, పార్టీని వీడే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.
గత ఏడాది జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు వైసీపి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ నెల 27న జరుగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో కూడా అదేవిదంగా ఒక్క టిడిపి అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే, లోక్సభ ఎన్నికలకు ముందు వైసీపి కోట బీటలు వారే ప్రమాదం ఉంటుంది. ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో వైసీపిపై తీవ్ర ప్రభావం పడుతుంది.




