ఈ శనివారం రాఖీ పౌర్ణమి. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు, వారిచ్చే బహుమతులు సంతోషంగా తీసుకుంటారు. కానీ దేశంలో ఇద్దరు చెల్లెమ్మలు ఈ రాఖీ పండుగ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారే… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
ఒకప్పుడు వీరిద్దరూ కూడా తమ అన్నలకు రాఖీ కట్టేవారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఆనందంగా అందరితో పంచుకునే వారు. కానీ అన్నతో రాజకీయాలు, ఆస్తుల పంపకాల గొడవల కారణంగా షర్మిల, రాజకీయ విభేదాల కారణంగా కల్వకుంట్ల కవిత ఇప్పుడు తమ అన్నలను పలకరించే పరిస్థితిలో లేరు. రాఖీ కట్టిన చెల్లిని జగన్ సొంత పార్టీ నేతలతో, సొంత మీడియాతో విమర్శింపజేస్తున్నారు. ఆమె కూడా ఘాటుగా బదులిస్తూనే ఉన్నారు.
కానీ కేటీఆర్ మాత్రం చెల్లి కల్వకుంట్ల కవిత విషయంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ స్పందించడం లేదు. చివరికి మొన్న ఆమె సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా పట్టించుకోలేదు.
కనుక ఈ రాజకీయ చెల్లెమ్మలు ఇద్దరూ ఎల్లుండి అన్నలకు రాఖీలు కట్టలేరు. కానీ వీరి గురించి మీడియా మాత్రం ఈవిదంగా నాలుగు ముక్కలు వ్రాసుకోగలుగుతుంది.






