దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని కించపరుస్తూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టేవారు.
శాసనసభ ఎన్నికలలో టీడీపీని రాజకీయంగా దెబ్బ తీయడం కోసం వైసీపీ అండదండలతో వ్యూహం అనే సినిమా కూడా తీశారు. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లని కించపరుస్తూ మాట్లాడారు. కొన్ని అభ్యంతరకర పోస్టులు, ఫోటోలు పెట్టారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ సంపాదించుకున్న వర్మ నేడు పోలీసుల ముందు హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇటువంటివారిపై ఇలాంటి కేసులపై అందరూ చాలా ఆసక్తి చూపేవారు. కానీ రాన్రాను ఇవి మీడియాకు, ప్రజలకు కూడా కాలక్షేపం వార్తలుగా మారిపోయాయి.
ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసు మొదలైనప్పుడు మళ్ళీ అందరూ ఆసక్తి చూపారు. కానీ ఆ కేసులో అరెస్టులు, జైలు, బెయిలుతో కాలక్షేపం అవుతోంది తప్ప పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఈ మాటన్నది మరెవరో కాదు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిలే! తన అన్నని టచ్ చేయలేకపోతోందని ఆమె కూటమి ప్రభుత్వాన్ని ఆక్షేపించారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఎట్టకేలకు ఆ కేసులో సిట్ అధికారులు నిన్న ఓ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసి, ఈ కేసులో జగన్ ప్రధాన సూత్రధారి అని తేల్చి చెప్పారు. కానీ జగన్కి ఇంకా ఎప్పుడు నోటీస్ పంపుతారో?పంపితే ఆయన విచారణకు వస్తారో లేదో? రాకపోతే రప్పించగలరో లేదో?అనేది సశేషం.
మరోపక్క వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతా రెడ్డి ఢిల్లీ నుంచి కడప ఎస్పీ కార్యాలయం వరకు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆ కేసులో అసలు కదలిక కనిపించడం లేదు.
కనుక మిథున్ రెడ్డి, చెవిరెడ్డి లాంటి గండరగండళ్ళని అరెస్ట్ చేసి లోపలేశామని అధికారులు జబ్బలు చరుచుకోవచ్చేమో కానీ ఆలోగానే వారు కూడా నేడో రేపో బెయిల్పై బయటకు వచ్చేయడం ఖాయమే.
ఎన్నికలకు ముందు తర్వాత ఇటు ఓ ఏడాది కాలం తీసేస్తే మిగిలినది మూడేళ్ళు. కనుక మిగిలిన ఈ మూడేళ్ళలో సిట్ అధికారులు ‘బిగ్ బాస్’ అలియాస్ ‘అంతిమ లబ్దిదారు’ వరకు చేరుకోగలరో లేదో?






