సోషల్ మీడియాలో అస్తమానం పవన్ నామస్మరణతో పబ్లిసిటీ పొందే వర్మ, తాజాగా మీడియాపై మండి పడుతున్నారు. ‘టీవీ9 జోకర్స్’ అంటూ అభివర్ణించడమే కాకుండా, హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత, మీడియాలో వస్తున్న వార్తలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు. పలు మీడియా సంస్థలు అసత్యపు ప్రచారాన్ని చేశాయని మండిపడ్డాడు. సినిమా తెరకెక్కించిన ఘనతే తనదని అన్నాడు. తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు.
సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. కాగా, ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ), ఆపై మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపై గత శనివారం వర్మను సీసీఎస్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.



