దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చివరికి అభివృద్ధి చెందిన దేశాధినేతలు సైతం ఎప్పటికప్పుడు అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన లేక నేటికీ తడబడుతుంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం దాని పట్ల అవగాహన పెంచుకొని వెంటనే వినియోగించుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల అదృష్టంగానే భావించవచ్చు.
అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ ఇందుకు చక్కని నిదర్శనం కాగా నేడు మంగళగిరిలో, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో నేడు ప్రారంభోత్సవమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఇందుకు మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
టాటా గ్రూప్ సహాయ సహకారాలతో ఏర్పాటైన ఈ హబ్లలో వ్యయసాయం, ఆక్వా రంగాలకు సంబంధించి స్టార్టప్ కంపెనీలు, వాటి ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతాయి.
యువతని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది వారిచేత స్టార్టప్ కంపెనీలు లేదా పరిశ్రమలు స్థాపింప జేసేందుకు ఈ హబ్లు తోడ్పడుతాయి.
ఇదిగాక విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో మరో నాలుగు హబ్లు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ అమరావతిలో ఏర్పాటవుతున్న ఇన్నోవేషన్ హబ్ కేంద్రంగా పనిచేస్తాయి.
ఆయా ప్రాంతాలలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, మానవ వనరులను బట్టి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి హబ్లో ఆగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ మ్యాను ఫ్యాక్చరింగ్, అనంతపురం హబ్లో ఆటోమోటివ్ పరికరాలు, ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తారు.
విజయవాడ హబ్లో రవాణా, పబ్లిక్ సెక్టార్, ఉత్పత్తి రంగం, విశాఖ హబ్లో సాఫ్ట్ వేర్, ఫార్మా, మారిటైమ్ రంగాలలో పరిశోధనలు, ప్రయోగాలు, స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.
స్థానిక యువతతో పాటు ఎప్పటికప్పుడు అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు దేశవిదేశాలకు చెందిన సంస్థలను కూడా వీటిలో భాగస్వామ్యం కల్పిస్తారు.
ఈ హబ్లన్నిటిలో ఏఐ, డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ పరస్పరం అనుసంధానమై పనిచేస్తాయి.
ఈరోజు సిఎం చంద్రబాబు నాయుడు, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కలిసి మంగళగిరిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలోమంత్రులు నారా లోకేష్, టిజి భరత్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తర్వాత ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్తో కలిసి వర్చువల్గా రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించనున్నారు.






