స్థిరత్వం, నిలకడ లేని రాజకీయ నాయకులకు రావెల కిశోరె బాబు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎప్పుడు ఏ పార్టీ కండువాతో కనపడుతారో తన కార్యకర్తలకు కూడా తెలియదేమో అన్నట్లుగా మెడలో కండువాలు మారుస్తూ ఉంటారు రావెల. ఈయన గారు పార్టీలే కాదు తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాలు కూడా దాటగలరని నిరూపించారు.
2014 ఎన్నికలలో టీడీపీ పార్టీ తరుపున విజయం సాధించి ఎస్సి కోటాలో మంత్రి పదవి కూడా సాధించుకున్నారు. అవినీతి ఆరోపణలతో ఐదేళ్లు నిండకుండానే మంత్రి పదవి కోల్పోయిన రావెల 2018 లో జనసేన జెండా పట్టుకున్నారు. అయితే అక్కడ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోవడంతో ఇక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కమలనాధులు రావెల సేవలను వద్దనుకున్నారో లేక ఈ సారి ఏపీ లో ఉన్న పార్టీలు మారిస్తే ఉపయోగం లేదు ఏకంగా పక్క రాష్ట్ర పార్టీలలో చేరాలనుకున్నారో ఏమో కానీ బిఆర్ఎస్ కారెక్కారు. రావెల కారెక్కాక కేసీఆర్ కారు సర్వీసింగ్ కు వెళ్లిందో లేక సర్వీసింగ్ కు వెళ్లే కారులో రావెల కిషోర్ బాబు ప్రయాణం చేయాలనుకున్నారో కానీ రావెల ఎంట్రీ తో కేసీఆర్
“పాలన నుంచి ఫామ్ హౌస్” కి పరిమితమయ్యారు.
ఇక రెండు రాష్ట్రాలలో మిగిలి ఉంది వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. అయితే ఈసారి రావెల ఎవరిని గద్దెదింపాలని ఆశపడుతున్నారో అనుకున్న తరుణంలో ఆయన ఏపీ లో వైసీపీ ఫ్యాన్ కింద సేదతీరడానికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రావెల కిషోర్ బాబు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దీనితో జగన్ రావెల గండాన్ని దాటి ముందుకెళ్లగలరా..?అంటూ వైసీపీ అభిమానులే కంగారుపడుతున్నారు.
మొత్తానికి ఒక్క కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే తెలుగు రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలను కవర్ చేసిన “పొలిటికల్ ఆల్ రౌండర్” గా రావెల కిషోర్ బాబు పేరుగడించారు. ఎన్ని పార్టీలు మరీనా రావెల రాజకీయ గీత మాత్రం మారడం లేదనే చెప్పాలి. పార్టీలు మారితే కాదు ప్రజల తరుపున పని చేస్తేనే ‘రా’వెల ‘రా’జకీయాలలో ‘రా’ణిస్తారని గ్రహించాలి. ఈ మూడు ‘రారారా’ లు జరిపించడం జగన్ వల్ల సాధ్యమవుతుందా..?




