ఈసారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులను వారి సొంత నియోజకవర్గాలలోనే ఓడించి రాజకీయంగా చావు దెబ్బ తీయాలని తహతహలాడిన జగన్, అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ముద్రగడ పద్మనాభంని పార్టీలో చేర్చుకొని ఆయన చేత తిట్టించడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
అయితే టిడిపి కూడా ఇదే ఫార్ములాతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.
అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని పులివెందుల కంచుకోటలో ఓడించడం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ అద్భుతంగా జరుగబోతోందని పులివెందుల నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన బీటెక్ రవి ఓ తాజా ఇంటర్వూలో చెప్పారు.
అయితే ఫలితాలకు ముందే తాను ఈ మాట చెపితే అందరూ వెటకారం చేస్తారని తాను ఇప్పుడు ఈ మాట గట్టిగా చెప్పడం లేదు కానీ చివరికి తన చేతిలో జగన్ ఓడిపోవడం అందరూ చూస్తారని చెప్పారు.
దీనికి ఆయన కొన్ని బలమైన కారణాలు చెప్పారు. ఈసారి కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందనే ‘మౌత్ టాక్’ బాగా వినిపిస్తుండటంతో ఇంతకాలం పులివెందులలో తమతో ఆడుకున్న వైసీపి నేతలే, ఈసారి ఎన్నికలలో ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి ఓట్లు వారు వేసుకొని ప్రశాంతంగా పోలింగ్ జరిపించుకుందామని తనకు ప్రతిపాదనలు పంపారని బీటెక్ రవి చెప్పారు.
ఇప్పుడు ఓడిపోబోయే జగన్ కోసం అల్లర్లకు పాల్పడితే రేపు కూటమి అధికారంలోకి వచ్చాక తన వల్ల ఇబ్బందులు పడాల్సివస్తుందనే చిన్న భయం పులివెందుల వైసీపి నేతల్లో ఏర్పడిందన్నారు. అందుకే మాచర్లలో అల్లర్లు చెలరేగినా పులివెందులలో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పారు.
ఈసారి టిడిపి మండలాధ్యక్షులను, సీనియర్ నేతలను ప్రతీ పోలింగ్ బూత్లో తన ప్రతినిధిగా ఉంచడంతో వైసీపి నేతలు రిగ్గింగ్ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.
ఇదివరకు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరిగినప్పుడు సులువుగా రిగ్గింగ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈవీఎంలు రావడంతో రిగ్గింగ్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది కనుక ఇది వరకులా తన ప్రతినిధులను ప్రలోభపెట్టి, బెదిరించి రిగ్గింగ్ చేసుకోలేకపోయారని బీటెక్ రవి చెప్పారు.
ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే తాను పార్టీ కార్యకర్తలు అందరికీ వైసీపి చేయబోయే దౌర్జన్యాలు, కేసుల పేరుతో వేధింపుల గురించి వివరించి, ధైర్యంగా పోరాడాలని చెపుతూ వారికి అండగా నిలబడటం వలన ఈ ఎన్నికలలో వైసీపిని గట్టిగా ఎదుర్కోగలిగామని చెప్పారు.
పోలింగ్ రెండు రోజుల ముందు ఢిల్లీ నుంచి ఎన్నికల కమీషన్ అధికారులు కడపలో పర్యటించి, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించడం కూడా స్థానిక వైసీపి నేతలను వెనక్కు తగ్గేలా చేసిందని బీటెక్ రవి చెప్పారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందని, వస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన, భయం పులివెందులలో వైసీపి నేతలను రెచ్చిపోకుండా ఆపిందని బీటెక్ రవి చెప్పారు.
ఇప్పుడు తాను చెపుతున్న మాటలను అందరూ జోక్గా తీసిపడేస్తారని కానీ కౌంటింగ్లో రోజున రాష్ట్రంలో పులివెందుల ఓటింగ్, ఫలితం గురించి ఎక్కువ చర్చ జరుగబోతోందని బీటెక్ రవి చెప్పడం చూస్తే ఈసారి పులివెందుల కంచుకోటలోనే వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత ఎదురీది ఉంటారో ఊహించుకోవచ్చు.




