ఏపీ రాజకీయాలలో పరిచయం అవసరమే లేని వ్యక్తి రాయపాటి సాంబశివరావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోయే రాయపాటి మొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానిలో ఉండేవారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ మునుగుతుందని గ్రహించగానే టిడిపిలో చేరారు. అయితే టిడిపి అధికారం కోల్పోయినప్పటికీ ఇంతకాలం వైసీపీలో చేరకపోవడమే విచిత్రం! బహుశః జగన్మోహన్ రెడ్డితో తాను సర్దుకుపోలేనని ఆలోచనతోనే ఇంతకాలం వైసీపీలోకి వెళ్ళలేదేమో?
కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు తన చిరకాల ప్రత్యర్ధి కన్నా లక్ష్మినారాయణని టిడిపిలోకి చేర్చుకొని, సత్తెనపల్లి టికెట్ ఖరారు చేస్తూ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించడంతో రాయపాటి తీవ్ర అసంతృప్తి చెందారు.
ఈసారి తన కుమారుడికి, తాను సూచించిన మరో ఇద్దరికీ తాను కోరుకొన్నచోట తప్పనిసరిగా టికెట్స్ ఇవ్వాలని లేకుంటే, తానే బరిలో దిగాల్సివస్తుందని, తాను బరిలో దిగితే ఎవరూ ఎదురునిలవలేరనే సంగతి టిడిపికి తెలుసని రాయపాటి బహిరంగంగానే హెచ్చరించారు. కానీ చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంతో రాయపాటి తీవ్ర అసంతృప్తి చెందారు.
ఇది గమనించిన వైసీపీ అధిష్టానం ఆయనతో టచ్చులోకి వెళ్ళి గుంటూరు లోక్సభ సీటు, సత్తెనపల్లి శాసనసభ సీటు ఆఫర్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి లోక్సభకు రాయపాటి, సత్తెనపల్లి నుంచి శాసనసభకు ఆయన కుమారుడు పోటీ చేయవచ్చని వైసీపీ ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ రాయపాటికి ఈ ఆఫర్ అంగీకరమైతే సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుని కృష్ణాజిల్లా అవనిగడ్డకు పంపించేందుకు సిద్దమని తెలిపిన్నట్లు సమాచారం. సత్తెనపల్లిపై మంత్రి అంబటి రాంబాబు పట్టు సాధించినప్పటికీ కన్నా లక్ష్మినారాయణకే ఎక్కువ ప్రజాధారణ, మంచిపేరు ఉన్నందున, ఆయనను ఓడించేందుకు రాయపాటి వంటి ఉద్దండుడే సరైనవాడని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు లోక్సభ, శాసనసభ రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్దపడిన్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలనుకొంటోంది. కనుక రాయపాటిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాయపాటి ఎక్కడ నుంచి పోటీ చేసినా తన సొంత అంగబలం, అర్దబలంతోనే గెలవగలరు కనుక ఆయన కాంగ్రెస్, వైసీపీ రెండు పార్టీలలో దేనిలో చేరాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాయపాటి పార్టీ మారితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి, వైసీపీల బలాబలాలు కూడా మారుతాయి.



