మోడీ ప్రభుత్వం నల్లధనం పోగేసుకొన్నవారికి మళ్ళీ ఈరోజు మరో పెద్ద షాక్ ఇచ్చింది. 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన తర్వాత చలామణిలోకి తీసుకువచ్చిన రూ.2,000 నోట్లను ఇప్పుడు ఉపసంహరించుకొంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.
ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులలో మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇక నుంచి అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు రూ.2,000 నోట్లు ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. కనుక ఇక నుంచి ఖాతాదారులు ఇచ్చే రూ.2,000 నోట్లను బ్యాంకులు తీసుకొని వాటిని రిజర్వ్ బ్యాంకుకు అప్పగించేస్తుంటాయి కనుక గడువులోగా ఆ నోట్లు మార్కెట్ల నుంచి కనుమరుగు కానున్నాయి.
దేశంలో నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు అంటూ మోడీ ప్రభుత్వం 2016, నవంబర్ 8వ తేదీ అర్దరాత్రి నుంచి రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో మళ్ళీ రూ.500 కొత్త నోట్లతో పాటు ఇంకా పెద్ద నోటు రూ.2,000ని ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలపాలైంది. అయితే ఆనాడు ఊహించిన్నట్లే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు అకస్మాత్తుగా రూ.2,000 నోట్లను ఉపసంహరించుకొంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
దీని వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ భారీగా నల్లధనం పోగేసుకొన్న రాజకీయ పార్టీలకు, నేతలకు, కార్పొరేట్ కంపెనీలకు, విద్యా, వైద్య, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలలో ఉన్నవారికి ఇది మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు వారందరూ తప్పనిసరిగా తమవద్ద పోగుచేసుకొన్న నల్లధనాన్ని బ్యాంకులలో జమా చేసేందుకు బయటకు తీయక తప్పదు. అదే జరిగితే… ఎవరెవరు ఎంత నల్లధనం పోగేసుకొన్నారనే విషయం ప్రభుత్వానికి, ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులకు తెలిసిపోతుంది. ముఖ్యంగా… వచ్చే ఎన్నికలలో వేలకోట్లు ఖర్చు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుగంటున్న పార్టీలకి, వాటి నేతలకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.



