తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో ఈరోజు ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సిఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని దాని సారాంశం.
గత రెండు నెలలుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనడం దానిలో వారిని ప్రజలు గట్టిగా నిలదీస్తుండటంతో సహనం కోల్పోతున్న వైసీపీ నేతలు వారిని దూషిస్తుండటం వంటి ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
గడప గడపకి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాల గురించి ప్రజలకు చెప్పుకొని వారికి మరింత చేరువు అవ్వాలని భావిస్తే, తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతునట్లు సర్వేలో తేలడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. వారిని ఒక్కొక్కరినీ తన కార్యాలయానికి పిలిపించుకొని పనితీరు మెరుగు పరుచుకోవాలని లేకుంటే వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశించవద్దని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొంది. వారిని హెచ్చరించడమే గాక ప్రజలలో ఏవిదంగా మమేకం కావాలో వివరించి చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.
ఇదే విషయం టిడిపి లేదా ఏదైనా మీడియా సంస్థ సర్వే చేసి చెపితే ఇదంతా ఎల్లో మీడియా సృష్టి… కుట్ర అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తుంటారు. కానీ గత ఎన్నికలలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో తోడ్పడిన టిఆర్ఎస్కు చెందిన అధికార పత్రికలో వచ్చిన ఈ వార్తాపై ఏమంటారు? ఇది నిజమని ఒప్పుకొంటారా లేక ఏపీలో జరుగుతున్నా అభివృద్ధి చూసి ఓర్వలేక తెలంగాణ పత్రికలు కూడా కుట్ర చేస్తున్నాయని అంటారా?



