ఈ రోజుల్లో ఉద్యోగాలకు భద్రత లేదు. ఉన్నా లేకపోయినా బేతాళుడి శవంలా ఈఎంఐలను జీవితాంతం భుజం మోస్తూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో కూడా వైట్ కాలర్ ఉద్యోగులు వీకెండ్ ఎంజాయ్మెంట్, హోటల్స్లో, పార్టీలు, విహారయాత్రలు తప్పనిసరన్నట్లు దర్జాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ రేపు ఉద్యోగం పోతే? అనే ఆలోచన, భయం ఎంతమందికి ఉంది?అంటే లేదనే అనిపిస్తుంది వీకెండ్ ట్రాఫిక్ చూస్తే.
ఇలాంటి పరిస్థితిలో సైబర్ నేరగాళ్ళబారిన పడి ఉన్న డబ్బు, అప్పులు చేసి తెచ్చిన డబ్బు కూడా పోగొట్టుకుంటే? ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? అని ఆలోచించడానికి కూడా భయమేస్తుంది.
అదే.. పదవీ విరమణ చేసిన వృద్ధులు ఇలా మోసపోతే? పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడుగా పనిచేసి గతేడాది ఆగస్టులో రిటైర్ అయ్యారు. ఇలాంటి రిటైర్ అయిన వృద్ధులని కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు వెతికి పట్టుకొని మరీ దోచేస్తున్నారు.
ఆయనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యింది యూకేలో ఉంటున్నానని చెప్పిన కందుకూరి మౌనిక. ఓ మూడు నెలలు మంచి అమ్మాయిలా ఫ్యామిలీ, పెళ్ళి పిల్లలు, ఉద్యోగాలు, తీర్ధయాత్రల ముచ్చట్లు.
వాటితో బాగా నమ్మకం సంపాదించాక రిటైర్మెంట్ డబ్బుని ఎలా మదుపు చేస్తే మంచిదో సలహాలు ఇస్తూ మెల్లగా ‘షేర్ మార్కెట్’వైపు నడిపించింది. దానిలో పెట్టుబడి పెడితే మీ సొమ్ము రెట్టింపు అవుతుందని నచ్చజెప్పింది.
ఆమె డబ్బేమీ అడగడం లేదు. పైగా తనకు మంచి దారి చూపిస్తోంది… అని నమ్మిన ఆ వృద్ధుడు పొన్నం వెంకటేశ్వర్లు ఆమె పంపిన లింక్స్ ద్వారా కోటి రూపాయలు విడతల వారీగా చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేసేశారు.
ఆ తర్వాత కొత్తగా చెప్పుకోవడానికి ఏముంటుంది? కందుకూరి మౌనిక ఫోన్ స్విచ్చాఫ్! లబోదిబోమంటూ ముసలాయన సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు పరుగు! కానీ గోడకేసి సున్నం తిరిగి వస్తుందా? ఇలాంటివి అంతే!




